హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ప్లీనరీ సభ ఏర్పాట్లకు సంబంధించిన కమిటీలను కేటీఆర్ వేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని చెప్పారు. ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితిల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, మహిళా కో ఆర్డినేటర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులుకు ప్లీనరీకి ఆహ్వానించనున్నట్టుగా కేటీఆర్ చెప్పారు. వీరందరికీ ఆహ్వానాలు పంపనున్నట్టుగా తెలిపారు.
పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్లీనరీకి ఆహ్వానించనున్నట్టుగా చెప్పారు. వీరికి కూడా ఆహ్వానాలు పంపుతామని తెలిపారు. ప్రతినిధులు సమావేశ ప్రాంగణానికి ఉదయం 10 గంటలలోపే చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వచ్చిన ప్రతినిధుల వివరాల నమోదు, వారి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది తెలిపారు.
ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ జెండా ఆవిష్కరించడంతో సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగుతుందన్నారు. వివిధ తీర్మానాలు ఆమోదించడం, పలు రాజకీయ అంశాలపైన చర్చలు సాగుతాయని చెప్పారు. ఎవరికైతే ఆహ్వానాలు అందుతాయో వారిని మాత్రమే అనుమతించబడుతారని.. అందుకే ఆహ్వానాలు అందినవారే రావాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాను పార్టీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బస్తీలు, పట్టణాల్లో కూడా పార్టీ జెండాలను ఆవిష్కరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా ఆవిష్కరణ బాధ్యత ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులేదనని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన కర్మ టీఆర్ఎస్ లేదని కేటీఆర్ అన్నారు. పాలమూరుకు, రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఏం చేసిందని.. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వనందుకు పాదయాత్ర చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. పక్కనే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకకు వెళ్లి.. అక్కడి ప్రభుత్వ పనితీరును తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణలో అమలయ్యే ఒక్క పథకమైనా కర్ణాటకలో అమలు అవుతుందా అని ప్రశ్నించారు. కర్ణాటకకు వెళ్లేందుకు అవసరమైతే వెహికల్ ఏర్పాటు చేస్తామన్నారు. మత పిచ్చి రెచ్చగొట్టడం తప్ప రాష్ట్రంలో ఏ దేవాలయానికి బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దేశమంతా ఉచిత విద్య, వైద్యం పెడితే తాము మద్దతిస్తామని అన్నారు. కృష్ణా బోర్డును శిఖండితో పోల్చారు. ఇక, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూరును పొత్తు కోసం ఎవరు అడిగారని ప్రశ్నించారు.
