జిల్లాల పునర్విభజనపై కోదండరాం ఫైర్ అశాస్త్రీయంగా విభజించారని మండిపాటు

గతంలో రాజులు తమ రాజ్యాలను కొడుకులకు పంచిచ్చినట్లు... నీకో జిల్లా, నాకో జిల్లా అని టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ల పార్టీకి అనుగుణంగా జిల్లాలను విభజించిందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు.

జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని ధ్వజమెత్తారు.ప్రజల కోరిక మేరకే మండలాలు, జిల్లాల విభజన జరుగుతుందని మొదట చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమ పార్టీకి అనుకూలంగా జిల్లాలను విభజించిందని చెప్పారు.


జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రిలో కలపాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా సాగుతున్న ఆందోళనలో భాగంగా గుండాలలో బుధవారం మిలీనియం మార్చ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కోదండరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ... కష్టపడి తెలంగాణను సాధించుకుంటే.. పాలకులు బంగారు తెలంగాణగా మారుస్తామని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు.

సబ్బండ జాతి ఏకమై ఉద్యమిస్తే ప్రజాభీష్టాన్ని పట్టించు కోని పాలకులు సన్నాసుల్లో కలుస్తారని అన్నారు.