డిఎస్సీ గురించి ప్రస్తావించిన కేసిఆర్ డిఎస్సీ కి తొందరేముందని ప్రశ్న
తెలంగాణలో ఆశించిన మేర ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక ఉసూరుమంటున్న నిరుద్యోగుల నెత్తిన మరో పిడుగు పడింది. సిఎం కేసిఆర్ తెలంగాణ నిరుద్యోగులకు గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ డిఎస్సీపై కేసిఆర్ కరుకుగానే మాట్లాడిర్రు.
ప్రగతిభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్సీ అంశాన్ని కేసిఆర్ ప్రస్తావించారు. అప్పుడు ఏమన్నారో ఆయన మాటల్లోనే కింద చదవండి.
‘‘డిఎస్సీ పెట్టాలి అర్జంట్ గ అంటున్నరు. ఎట్ల పెడతరు. అంత తొందరేముంది.
డిఎస్సీ ఆలస్యమైతే ప్రపంచం మునిగిపోతదా? ఏమైతది?
దానికేం తొందర ఉంది. దాన్ని పరిశీలిస్తున్నం. జోన్ల అంశం చూడాలి. గింతదానికే ముఖ్యమంత్రి మీద అసత్య ప్రచారం చేసుడు ఎక్కడన్నా ఉందా?’’ అని కేసిఆర్ కామెంట్ చేశారు.
సిఎం చేసిన కామెంట్లు చూస్తే త్వరలో డిఎస్సీ అని ఆశతో ఉన్న నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యే వాతావరణం ఉంది. సిఎం కామెంట్లు చూస్తే ఇప్పట్లో డిఎస్సీ జరిపే ఉద్దేశం కనిపించడంలేదని ఒక నిరుద్యోగి ఏషియా నెట్ తో ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల వరకు ఈ డ్రామా ఇట్నే కంటిన్యూ చేస్తుండొచ్చు అని ఆ నిరుద్యోగి నిట్టూర్చాడు.
తెలంగాణలో విద్యారంగం పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. గత ఐదేళ్ల కాలంలో విద్యారంగంలో ఒక్క టీచర్ పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో రెండేళ్లు టీచర్ పోస్టల భర్తీ జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మూడేళ్ల కలంలో సర్కారు టీచర్ పోస్టుల భర్తీ చేపట్టలేదు.
దీంతో ఐదేళ్ల కాలంగా ప్రభుత్వ టీచర్లంతా ఒకవైపు రిటైర్ మెంట్లు అవుతుండగా ఆ పోస్టుల భర్తీ లేక, కొత్త పోస్టుల భర్తీ లేక ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు లక్షల మంది డిఎస్సీ కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు అభ్యర్థులు. బిఇడి, డిఇడి పాసై టెట్ క్వాలిఫై అయి ఎప్పుడు డిఎస్సీ వేస్తారా అని ఆశతో ఉన్నారు.
కానీ సిఎం విలేకరుల సమావేశంలో చేసిన కామెంట్లు చూస్తే మరింత కాలం డిఎస్సీ ప్రకటన వాయిదా పడుతుందేమోనని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కొలువులకై కొట్లాట అంటూ జెఎసి చేపట్టనున్న సభ పట్ల కూడా కేసిఆర్ కరుకుగా మాట్లాడారు.
మొత్తానికి తెలంగాణ డిఎస్సీ కోసం అభ్యర్థులు మరికొద్దిరోజులు వేచి చూడక తప్పదేమో మరి.?
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
