- Home
- Andhra Pradesh
- Flood Alert : ఏపీలో భారీ వర్షాలే లేవు, అయినా పొంచివున్న వరద ముప్పు.. ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
Flood Alert : ఏపీలో భారీ వర్షాలే లేవు, అయినా పొంచివున్న వరద ముప్పు.. ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు లేకున్నా వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసింది వాతావరణ శాఖ, ఇవాళ రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయట.

తెలుగు రాష్ట్రాలకు వరద హెచ్చరికలు
Flood Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి... కాబట్టి నదుల్లోకి భారీ నీరు చేరుతోంది... కాబట్టి ప్రమాదకర స్థాయికి ప్రవాహం చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా వర్షాలు లేవు.. అయితే ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. చివరికి ప్రమాద హెచ్చరికలు జారీచేసే స్థాయిలో వరదనీరు ఈ నదిలో ప్రవహిస్తోంది.
గోదావరి ఉగ్రరూపం... ప్రమాద హెచ్చరికలు జారీ
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ప్రస్తుతం నీటి మట్టం 45.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన వర్షాలు కొనసాగుతుండటంతో గొదావరిలో నీటిమట్టం పెరిగే అవకాశాలున్నాయి... కాబట్టి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచిస్తోంది.
ఇక ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులుగా ఉందని APSDMA తెలిపింది. అయితే వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు… ఔట్ ప్లో కూడా 5.39 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ (ఆగస్ట్ 1, శనివారం) ఉదయానికి నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉండటంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని విపత్తు సంస్థ తెలిపింది.
గోదావరి ఉగ్రరూపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో దిగడం, చేపలు పట్టడం లేదా వరద నీరు ప్రవహించే రోడ్లపై ప్రయాణించడం వంటివి చేయవద్దని ప్రజలకు హెచ్చరించారు. వరదనీటితో ప్రవహించే వాగులు, కల్వర్టులు కూడా దాటే ప్రయత్నం చేయవద్దని ప్రఖర్ జైన్ సూచించారు.
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలుకు గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం 🌊 : #APSDMA హెచ్చరిక:
🔺ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో/ఔట్ ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులు
🔴ఈరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక, రేపు (శనివారం) రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. pic.twitter.com/bdldAcRBO0— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 31, 2026
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఇవాళ (ఆగస్ట్ 1, శనివారం) ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ప్రఖర్ జైన్ సూచించారు. ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయం లేదా ఏదైనా సమాచారం కావాలంటే టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 కాల్ చేయాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
తెలంగాణలో గోదావరి పరవళ్లు
ఎగువన మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఐదారు రోజులుగా ఉత్తర తెలంగాణలో కూడా వర్షబీభత్సం కొనసాగుతుండటంతో గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. కాళేశ్వరం, ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్) ప్రాజెక్టులు వరదనీటితో నిండుకుండల్లా మారాయి. గోదావరి ఉపనది ఇంద్రావతి ప్రవాహం ప్రమాదకరంగా ఉంది... ఏకంగా 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాణహిత నదిలో కూడా వరనీరు ప్రమాదకర స్థాయికి చేరింది. మేడిగడ్డ, భద్రాచలం వద్ద 12-17 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
నేడు తెలంగాణలో వర్షాలు
ఇవాళ (ఆగస్ట్ 1, శనివారం) తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయట.
ఇక హైదరాబాద్ తో పాటు శివారు జిల్లా మేడ్చల్-మల్కాజ్ గిరి లోనూ జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. నగరంలో రోజంతా ఆకాశం మేఘాలతో నిండి చల్లని వాతావరణం ఉంటుందని.. కొన్నిచోట్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

