సచివాలయం కూల్చివేత: ప్రార్ధనా మందిరాలు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన
తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం వ్యక్తం చేశారు.
సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.
తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చి కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ క్రమంలో అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిన విషయం తనకు తెలిసిందన్నారు.. ఇలా జరగడం పట్ల తాను ఎంతో బాధపడుతున్నానుని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు.
also read:జూలై 13 వరకు సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్: తెలంగాణ హైకోర్టు ఆదేశం
ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా ఎన్నికోట్లైనా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతానని ఆయన హామీ ఇచ్చారు.
మత పెద్దల అభిప్రాయాలు తీసుకొని కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి అని ముఖ్యమంత్రి కోరారు.