ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. మొన్నటి వరకు సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ వచ్చిన కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్కు నోటీజులు జారీ చేయడంపై బుధవారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో భాగంగా, భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్కు జారీ చేసిన నోటీసులు రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ – "కేసీఆర్ గారు ఏ తప్పు చేశారు? ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా అని" అని ప్రశ్నించారు.
"కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర భూమికి 35% నీరు అందుతోంది. దీన్ని రాజకీయంగా వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కుట్ర కోసం కమిషన్ వేసింది. అది నిజమైన విచారణ కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ మాత్రమే" అని చెప్పారు.
కవిత ఇంకా మాట్లాడుతూ.. "మేడిగడ్డ వద్ద పనులు ఆపేశారు. ఏపీకి గోదావరి నీళ్లను తరలిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీటి తరలింపును అడ్డుకోవాలి" అని కోరారు.
భాజపా నేత ఈటల రాజేందర్పై కూడా ఆమె తీవ్రంగా స్పందించారు "తెలంగాణకు చెందిన నాయకుడిగా ఆయన మౌనంగా ఉండడం బాధాకరం. గోదావరి నీళ్ల రక్షణ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడం వంటి కీలక బాధ్యతలు ఈటల తీసుకోవాలి" అని సూచించారు.
