బీజేపీతో జత కట్టిన పార్టీలకు కొంతకాలం మాత్రమే భవిష్యత్తు ఉంటుందని..తరువాత ఆ పార్టీ కనుమరుగు అయిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ విషయం గురించే తాను కేసీఆర్‌ కి లేఖ రాసినట్లు ఆమె వివరించారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా మంచిర్యాలలో జరిగిన ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను పునః స్థాపించేందుకు తాను చేస్తున్న కృషి పట్ల స్పష్టత ఇచ్చారు.

బీజేపీతో జతకట్టే పార్టీలకు తాత్కాలికంగా లాభాలు కనిపించినా, దీర్ఘకాలంలో అవి ప్రభావం కోల్పోతాయని కవిత పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను పార్టీ అధినేత కేసీఆర్‌కు ముందుగానే చెప్పారు. పార్టీ లోపల పదేళ్లుగా అనేక కష్టాలను అనుభవించానని చెప్పిన ఆమె, కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని, బీఆర్ఎస్‌ను గుండెల్లో పెట్టుకొని నిలబెట్టాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

తన రాసిన లేఖ అంతర్గతంగా చర్చించాలన్న ఉద్దేశంతోనే రాసినదని, అయితే ఆ లేఖను బహిరంగం చేసింది ఎవరు అనే ప్రశ్నను ఆమె లేపారు. కేసీఆర్ కుటుంబ వ్యవహారాల కన్నా ప్రజా సమస్యలపైనే దృష్టి పెడతారని, అందుకే లేఖల ద్వారా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానని చెప్పారు.

భవిష్యత్తు రాజకీయాల దిశలో ముందుగానే అంచనా వేసే శక్తి తనకుందని చెప్పిన కవిత, పార్లమెంట్‌లో ఎంపీగా ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లు, మహిళా బిల్లు వంటి అంశాలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ అప్పుడు పట్టించుకోలేదని, తన అంచనాలు నేటి పరిస్థితులతో సరిగా సరిపోతున్నాయని చెప్పారు. పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలన్న తన అభ్యర్థనలను పట్టించుకోకపోవడంతో తెలంగాణ జాగృతి ద్వారా కొత్త తరం నాయకత్వానికి అవకాశం కల్పించినట్టు వివరించారు.

మానవత్వం లేని పార్టీ…

లిక్కర్ కేసులో తనపై కుట్ర జరిగిందని, తాను నిర్దోషినని స్పష్టంగా చెప్పారు. తన లేఖ వల్ల కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా ఏ విధమైన లాభం కలగదని కవిత అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే, బీజేపీపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవత్వం లేని పార్టీగా పేర్కొంటూ, ఆపరేషన్ కగార్ పేరిట జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనను దుయ్యబట్టారు. మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. జ‌ర్న‌లిస్ట్ మునీర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. కులపక్షపాతానికి సంకేతంగా పేర్కొన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు యాదాద్రిలో జరిగిన అవమానం, తాజాగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు సరస్వతి పుష్కరాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం ఇందుకు ఉదాహరణలుగా చెప్పారట.

ఈ మొత్తం ప్రకటనల ద్వారా, తన ప్రయోజనం ఏ పార్టీని ఓడించడం కాదని, బీఆర్ఎస్‌ను బలోపేతం చేయడమే అని కవిత స్పష్టం చేశారు.