కవిత రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లోపాలు చర్చించుకోవాలంటూ సూచించారు.
అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శంషాబాద్ ఎయిర్పోర్టులో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఇటీవల తన లేఖ లీక్ కావడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వరంగల్ సభ అనంతరం, దాదాపు రెండు వారాల క్రితం తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఓ లేఖ రాసిన విషయాన్ని కవిత వెల్లడించారు. ఆ లేఖలో పార్టీ భవిష్యత్కు సంబంధించి కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచినట్టు తెలిపారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటికి ఎలా చేరిందో అర్థం కాకపోవడం తనను కలవరపెట్టిందన్నారు. తాను అమెరికాలో తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకలో ఉన్న సమయంలోనే ఆ లేఖ బయటపడిందని చెప్పారు.
లేఖ లీక్ వెనుక కుట్రలు నడుస్తున్నట్టు గతంలోనూ చెప్పారు కవిత. ఇప్పుడు జరిగిందంతా చూస్తుంటే పార్టీ లోపలే ఎవరో ఉన్నారన్నదానిపై అంతర్గతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలోని పలువురు నాయకులు భావించే విషయాలనే తాను తన లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. తాను కేవలం ఒక ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా కేసీఆర్ కుమార్తె అయిన నైపథ్యంలో రాసిన లేఖ బయటకు రావడం ద్వారా పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో తెలుస్తోందన్నారు.
ఆయన చుట్టూ దెయ్యాల్లా…
పార్టీలో చిన్నపాటి లోపాల గురించి ఓపిగ్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని, అవే ఎక్కువైతే దెబ్బతినేది పార్టీ భవిష్యత్తేనని అన్నారు. తండ్రి కేసీఆర్ను దేవుడిగా అభివర్ణించిన ఆమె, ఆయన చుట్టూ దెయ్యాల్లా కొందరు ఆపద్ధర్మ నేతలు ఉండటం వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని విమర్శించారు.
తాను తన తండ్రికి తరచూ లేఖలు రాస్తానని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని స్పష్టం చేశారు. ఈ లేఖ చూసి కాంగ్రెస్ లేదా బీజేపీ పెద్దలు ఆనందపడాల్సిన అవసరం లేదన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత వచ్చిన స్పందనల నేపథ్యంలో ఆ లేఖ రాసినట్టు తెలిపారు.
ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కవిత మాత్రం పార్టీ లోపాలను వెలికితీయడమే లక్ష్యంగా లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే, పార్టీ పునర్వ్యవస్థీకరణ పట్ల ఆమె లోతైన ఆలోచనలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.