పరాయి స్త్రీల వ్యామోహంలో భర్త.. క్షణికావేశంలో వేడి నూనె పోసిన భార్య
హైదరాబాద్: తన భర్త పరాయి మహిళల వ్యామోహంలో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడనీ, ఇంటికి కూడా రావడం లేదని భార్య పేర్కొన్నారు. ఐదారు నెలలుగా వేరే మహిళలతో ఉంటున్నాడని చెప్పారు.
హైదరాబాద్: పరాయి స్త్రీల వెంటతిరుగుతూ.. తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్తపై క్షణికావేశంలో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబద్ నగరంలో చోటుచేసుకుంది.
కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ అశోక్కుమార్, ఎస్సై శేఖర్ లు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెందిన గిరిధర్లాల్, రేణుక దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. విజయవాడలోని సింగ్నగర్ లో వారు నివాసముండేవారు. అయితే, ఇటీవల పిల్లల పై చదువుల కోసం అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఇదివరకు విజయవాడలో మాంసం వ్యాపారం చేసే గిరిధర్లాల్.. హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత జియాగూడలో ఉన్న ఒక కబేళాలో పని చేస్తున్నాడు.
హైదరాబాదల్ లోని దరియాబాగ్లో వీరి కుటుంబం గత మూడున్నర సంవత్సరాలుగా నివాసముంటోంది. అయితే, నగరానికి వచ్చిన తర్వాత తన భర్త పరాయి మహిళల వ్యామోహంలో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడనీ, ఇంటికి కూడా రావడం లేదని భార్య పేర్కొన్నారు. ఐదారు నెలలుగా వేరే మహిళలతో ఉంటున్నాడని చెప్పారు. ఇదివరకే ఈ విషయంపై ఇద్దరి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మూడు రోజుల కిందట ఇంటికి వచ్చిన గిరిధర్ లాల్ ను ఎక్కడకు వెళ్లారని భార్య ప్రశ్నించింది. ఇద్దరిమధ్య మాటల ముదిరి.. వాగ్వివాదం చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట భర్త ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు కూడా మరోసారి వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే భార్య తన భర్తపై కాగుతున్న నూనెను పోసింది. దీంతో ఆయన తల, చేతులు, ఛాతీపై తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాధితుడిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు భార్య రేణుకను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామనీ, గతంలో కూడా ఏపీలో ఉన్నప్పుడు వీరి మధ్య గొడవలు జరిగాయనీ, పోలీసు కేసుల వరకు వెళ్లినట్టు సమాచారముందని పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీ ఆటోనగర్లో శ్రావణి, తన భర్తతో కాపురం ఉంటున్నది. వారికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి అయింది. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాపురంలో వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతా సజావుగా సాగుతున్నదని అనుకుంటున్న తరుణంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జరిగిన గొడవలో భార్య శ్రావణి.. భర్త గొంతు నులిమేసి ప్రాణాలు తీసింది. భర్తను హతమార్చడానికి అక్రమ సంబంధమే కారణం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.