ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్పై మరో కేసు నమోదు.. వివరాలు ఇవే..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్పై మరో కేసు నమోదైంది. నందకుమార్ బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టుగా వచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్పై మరో కేసు నమోదైంది. నందకుమార్ బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టుగా బంజారాహిల్స్కు చెందిన రియల్టర్ సిందెర్కర్ సతీష్ చేసిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్కు అతడి స్నేహితుడి ద్వారా 2017లో నందకుమార్ పరిచయమయ్యాడు. అప్పట్లో సతీష్ తరచూ నందకుమార్కు చెందిన ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1లోని ఫిల్మీ జంక్షన్ వెళ్లేవాడు. అయితే ఈ క్రమంలోనే తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సతీష్ వద్ద నుంచి డబ్బులు తీసుకునే నందు.. వాటిని మళ్లీ తిరిగి చెల్లించేవాడు. దీంతో నందుపై సతీష్కు నమ్మకం పెరిగింది.
2018లో వికారాబాద్ జిల్లా దోమ మండలంలో ఉన్న సుమారు 12 ఎకరాల భూమిని సతీష్ కోనుగోలు చేశారు. దీనికి నందు కమీషన్పై మధ్యవర్తిత్వం వహించాడు. డీల్ కుదిరిన తర్వాత ఆ మొత్తాన్ని యజమానికి చెల్లించాడు. అయితే ఆ తర్వాత కమీషన్ వద్దని, తన కు భూమి ఇవ్వాలని నంద కుమార్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే రూ. 21 లక్షలను నందుకు సతీష్ చెల్లించాడు.
Also Read: రాజకీయ దురుద్దేశ్యంతోనే డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత:నందకుమార్ భార్య
అయితే అక్కడ భూమి ధరలు పెరగడంతో నంద కుమార్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని, తాను ఉప ముఖ్యమంత్రి అవుతానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే సతీష్ మరికొంత డబ్బు చెల్లించినప్పటికీ నందకుమార్ బెదిరింపులు ఆపలేదు. అయితే ఇటీవల ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు కేసులో నందకుమార్ అరెస్ట్ అవడంతో.. సతీష్ ధైర్యం తెచ్చుకుని అతని బెదిరింపులపై పోలీసులు ఫిర్యాదు చేశారు.