Hyderabad: హైద‌రాబాద్‌లో పెను ప్ర‌మాదం త‌ప్పింది. 162 మందితో ల్యాండ్ అవుతున్న విమానానికి అనుకోని ప్ర‌మాదం ఏర్ప‌డింది. అయితే పైల‌ట్ చాక‌చ‌క్యంతో వ్య‌వ‌హారించ‌డంతో ప్ర‌యాణికులంతా సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. వివ‌రాల్లోకి వెళితే.. 

శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానానికి పెను ప్రమాదం త‌ప్పింది. గురువారం ఉదయం ల్యాండింగ్ సమయంలో విమానం ఒక పక్షి తోక త‌గిలింది. ఈ స‌మ‌యంలో విమానంలో 162 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

అయితే ప్ర‌మాదాన్ని ముందుగానే గుర్తిచిన పైలట్ తక్షణమే పరిస్థితిని గుర్తించి చాకచక్యంగా వ్యవహరించారు. ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడం ద్వారా ఎటువంటి గాయాలు లేకుండా ప్రయాణికులను రక్షించారు.

ఈ ఘటనను చూసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు, ప్రయాణికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం అత్యవసర ప‌రిస్థితుల్లో పైలట్ నిపుణత ఎంత కీలకమో మరోసారి రుజువు చేసింది.

ఎలుక కారణంతో ఆలస్యమైన విమానం

ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం ఇండిగో విమానంలో ఓ ఎలుక హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కాన్పూర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. 172 మంది ప్రయాణికులతో ఢిల్లీలోకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం ఒక ఎలుక కారణంగా మూడు గంటల ఆల‌స్య‌మైంది. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. విమాన సిబ్బంది టేక్ ఆఫ్‌కు సిద్ధమవుతుండగా, క్యాబిన్‌లో ఒక ఎలుక పరిగెత్తుతున్నట్టు గమనించారు. వెంటనే సీనియర్ అధికారులకు ఈ విషయం తెలియజేయగా, ముందుగా ప్రయాణికులను విమానంలోనుంచి లాంజ్‌కు తరలించారు. సిబ్బంది దాదాపు గంట క‌ష్ట‌ప‌డి ఎలుక‌ను విమానం నుంచి బ‌య‌ట‌కు పంపించారు.