Rain Alert: వచ్చే 5 రోజులు ఆగమాగమే.. వాయుగుండంతో ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరుణుడు ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వర్షాలు మొదలు కాగా వచ్చే 5 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 30 వరకు వర్షాలు
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నట్లు ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
గురువారం ఎల్లో అలర్ట్
టెలంగాణలో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
శుక్రవారం, శనివారం కూడా..
శుక్రవారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. శనివారం పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ పేర్కొంది. దీంతో కోస్తాంధ్రలో వర్షాలు మరింత పెరుగుతాయి.
* గురువారం: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* శుక్రవారం, శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వానలు పడతాయి.
వాయుగుండం ప్రభావం
ఐఎండీ అంచనా ప్రకారం.. ఉపరితల ఆవర్తనం సెప్టెంబర్ 26న దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్ర తీరాలను తాకి వాయుగుండంగా మారనుంది. 27న తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 30వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారుల సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గతంలో వరదలు వచ్చిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అలర్ట్గా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.