Hyderabad City Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులు
హైదరాబాద్ నగరవాసులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ (TSRTC) న్యూస్ చెప్పింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులు (City Buses) అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా.. విద్యార్థులకు కోసం కోఠీ- హయత్నగర్ మధ్య అదనంగా మరో 12 సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.
హైదరాబాద్ నగరవాసులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ (TSRTC) న్యూస్ చెప్పింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులు (City Buses) అందుబాటులో ఉంటాయని తెలిపింది. గతంలో మాదిరిగానే తెల్లవారుజాము నుంచే బస్సులు నడపనున్నట్టుగా పేర్కొంది. రాత్రి 10గంటల వరకు ఆ బస్సులను షెడ్యూల్ చేసినట్లు తెలిపింది. నగరంలోని పలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు నుంచి తెల్లవారుజాము నుంచే సిటీ బస్సులు నడపునున్నట్టుగా ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ముందుగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటుగా, ఎంజీబీఎస్, జేబీఎస్ లలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
హయత్నగర్, ఫలక్నుమా, ఉప్పల్, జీడిమెట్ల, చెంగిచర్ల, మిధాని, మెహిదీపట్నం, హెచ్సీయూ, మియాపూర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ డిపోల నుంచి తెల్లవారుజాము నుంచే సిటీ బస్సులు అందుబాటులో ఉంటున్నాయన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సులో ప్రయాణించి రద్దీని అంచనా వేసి అవసరమైన మేరకు బస్సులను పెంచే చర్యలు చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. మరోవైపు విద్యా సంస్థలు పూర్తిగా తెరుచుకోవడంతో విద్యార్థులకు కోసం కోఠీ- హయత్నగర్ (రూట్ నెంబర్. 299) మధ్య అదనంగా మరో 12 సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. నేటి నుంచే ఆ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
లాక్డౌన్ అనంతరం తొలుత కొద్ది మొత్తంలో మాత్రమే బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. ఆ తర్వాత వాటిని క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. ప్రస్తుతం కరోనా తీవత్ర తగ్గడం.. జనజీవనం కూడా సాధారణంగా మారడంతో నగరంలో రద్దీ పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ గతంలో మాదిరిగానే సర్వీసులను నడపాలని నిర్ణయయింది.
ఉదయం 6 గంటల నుంచే హైదరాబాద్ మెట్రో..
ఇదిలా ఉంటే మెట్రో వేళల్లో నేటి నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు ప్రారంభం కాగా.. రాత్రి 11.15 గంటలకు చివరి స్టేషన్కు చేరుకుంటాయి. ఇప్పటివరకు ఉదయం 7 గంటలకు మెట్రో రైలు సేవలు ప్రారంభం అవుతున్నాయి. అయితే దీని ద్వారా చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. ఉదయం మరింత ముందుగా మెట్రో రైలు సేవలు ప్రారంభం అయ్యేలా మార్పులు చేయాలని.. అభినవ్ సుదర్శి అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ను కోరారు. దీంతో కేటీఆర్ మెట్రో అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో వారు కూడా సానుకూలంగా స్పందించి మెట్రో వేళల్లో మార్పులు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక నుంచి ఉదయం 6 గంటలకు తొలి రైలు ప్రారంభమవుతుందని, చివరి రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.