పీఎఫ్ఐని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుల నిరసన
Hyderabad: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నేతృత్వంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు పీఎఫ్ఐకి చెందిన పలువురు నాయకులను అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది.
BJP stages protest-PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే హైదారాబాద్ నగరంలోని జాంబాగ్కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీఎఫ్ఐకి వ్యతిరేకంగా నినదించారు. దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రాకేష్ జైస్వాల్, పార్టీ కార్యకర్తలు దిష్టిబొమ్మలను దగ్ధం చేసి "దేశ్ కే గదరావ్ కో గొలీ మారూ, దేశ్ కా నేతా కైసా హూన్ నరేంద్ర మోడీ జైసా హూ" నినాదాలు చేశారు. రాకేశ్ విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐపై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
జూడో, ఆత్మరక్షణ తరగతుల ముసుగులో ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పీఎఫ్ఐ ముస్లింలకు శిక్షణ ఇస్తోందనీ, రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు రాష్ట్రంలో పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసిందని రాకేష్ జైస్వాల్ తెలిపారు. త్వరలోనే దేశాన్ని అంతర్జాతీయంగా హిందూ దేశంగా పిలుస్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నిరసన క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.
మహారాష్ట్రలోనూ బీజేపీ నిరసనలు
మహారాష్ట్రలో, దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని నిషేధించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లతో మాట్లాడతానని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే తెలిపారు. పూణేలోపీఎఫ్ఐ నిర్వహించిన నిరసనలో "పాకిస్తాన్ జిందాబాద్" నినాదాలు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన వారిని దేశద్రోహం కేసుల కింద అరెస్టు చేయాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలోనూ, దేశంలోనూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడతాను. మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నా వారిని వెతికి పట్టుకోవాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరతాను. వారిని దేశద్రోహం కేసు నమోదుతో అరెస్టు చేయండి" అని బవాన్కులే అన్నారు.
కాగా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పోలీసుల సంయుక్త బృందాలు సెప్టెంబర్ 22న పీఎఫ్ఐకి వ్యతిరేకంగా దేశంలోని 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 106 మంది సభ్యులను అరెస్టు చేశాయి. 15 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులపై నిర్వహించిన అతిపెద్ద అణిచివేతకు "ఆపరేషన్ ఆక్టోపస్" అనే కోడ్ పేరు ఉందని శనివారం సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు తీవ్రవాదం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, సాయుధ శిక్షణను అందించడం, నిషేధిత సంస్థల్లో చేరేందుకు ప్రజలను తీవ్రవాదులను చేయడంలో శిక్షణా శిబిరాలను నిర్వహించడం వంటి అంశాలకు సంబంధించిన కేసుల క్రమంలోనే ఈ సోదాలు-అరెస్టులు జరిగాయని ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి.