కౌశిక్ రెడ్డి వల్ల బిఆర్ఎస్ నష్టపోతోంది..: కేసీఆర్ కు హుజురాబాద్ నాయకుడి ఫిర్యాదు
ఎమ్మెల్సీ, హుజురాబాద్ బిఆర్ఎస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డిపై సొంత పార్టీకి చెందిన నాయకులే ముఖ్యమంత్ర కేసీఆర్ కు ఫిర్యాదు చేసారు.
కరీంనగర్ : హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హుజురాబాద్ ఇంచార్జ్ బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీని చేసి శాసనమండలి విప్ గా నియమించారు. ఇలా కౌశిక్ రెడ్డికి బిఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తుంటే అతడు మాత్రం హుజురాబాద్ నాయకులను కలుపుకుపోవడంలేదని... ఆయన తీరు పార్టీకి నష్టం చేసేలా వుందని స్థానిక నాయకులు వాపోతున్నారు. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేయడానికి సిద్దమయ్యారు.
బిఆర్ఎస్ పార్టీ కోసం కాకుండా తన వ్యక్తిగత రాజకీయ లబ్దికోసం కౌశిక్ రెడ్డి పనిచేస్తున్నాడని జమ్మికుంట మార్కెట్ కమిటీ ఛైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి ఆరోపించారు. సొంత పార్టీ నాయకులను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలా వ్యవహరిస్తున్నారని... ఇది పార్టీకి తీవ్ర నష్టం చేసేలా వుందంటూ కౌశిక్ రెడ్డిపై సీఎం కేసీఆర్ కు సమ్మిరెడ్డి ఫిర్యాదు చేసారు. ఇప్పటికే చాలామంది బిఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తున్నారని... ఇది ఇలాగే కొనసాగితే వారంతా బిఆర్ఎస్ ను వీడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కాబట్టి హుజురాబాద్ లో బిఆర్ఎస్ బలోపేతం కోసం కౌశిక్ రెడ్డిని కట్టడి చేయాల్సిన అవసరం వుందంటూ సమ్మిరెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు.
Read More హుజురాబాద్లో ఓ సైకో .. నాపైనే సుపారీ ఇస్తారా, చెప్పుల దండా వేసి తిప్పుతా : ఈటల రాజేందర్ వార్నింగ్
ఇక ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలో బిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్గం కూడా కౌశిక్ రెడ్డిని వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ఉద్యమకాలం నుండి బిఆర్ఎస్ పార్టీలో వున్న తనను కాదని కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో పార్టీలో చేరిన కౌశిక్ కు అధిక ప్రాధాన్యత దక్కడంపై గెల్లు గుర్రుగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ లు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం వారిమధ్య వున్న గ్యాప్ ను తెలియజేస్తుంది.
కౌశిక్ రెడ్డిపై సొంత పార్టీలోనే కాదు వివాదాస్పద వ్యాఖ్యలతో కొన్ని సామాజికవర్గాల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఇటీవల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారిని కౌశిక్ బూతులు తిడుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే ముదిరాజ్ లకు తనకు దూరం చేయాలని కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని... అందులో భాగంగానే నకిలీ ఆడియో సృష్టించారని అన్నారు.తన వాయిస్ తో వున్న ఈ ఆడియో వల్ల ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కోరారు.
ఇక తనను చంపేందుకు కౌశిక్ రెడ్డి సుఫారీ ఇచ్చాండటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. తనను చంపించేందుకు రూ.20 కోట్లు సుఫారి ఇచ్చినట్లు ఈటల ఆరోపించారు. కౌశిక్ రెడ్డి మాత్రం కావాలనే ఈటల తనపై బురదజల్లే ప్రయత్నంచేస్తున్నారని అంటున్నారు. హత్యారాజకీయాలు ఈటలకు అలవాటు... తాను మాత్రం రాజకీయంగానే ఆయనను ఎదుర్కొంటానని కౌశిక్ పేర్కొన్నారు.