హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంలో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను అదనపు కట్నంతో పాటు బాధితురాలిపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైని వివాహిత సౌందర్య భర్త గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం తరచూ సౌందర్యను గణేష్ వేధిస్తున్నాడు. పిల్లలు పుట్టాక బాగా లావు అయ్యావని.. అందంగా లేవంటూ ఆమెను మానసికంగా హింసించే వాడని సమాచారం. సౌందర్య అత్తమామలపైనా గణేష్ దాడి చేశాడని తెలిపింది. 

అతని వేధింపుల కారణంగా యాదాద్రిలో వున్న ఫ్లాట్‌ను గణేష్ మీద రాశారు. అయితే బన్సీలాల్‌పేటలోని డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కూడా తనపై రాయాలంటే గణేశ్.. సౌందర్యను చిత్ర హింసలకు గురిచేశాడు.పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం ఇచ్చామని.. అయినప్పటికీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 

ALso Read: హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో విషాదం.. పిల్లలను బిల్డింగ్ పైనుంచి తోసేసి తల్లి ఆత్మహత్య..

వేధింపుల నేపథ్యంలో సోమవారం బన్సీలాల్‌పేట్‌లో సౌందర్య ‌ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. సౌందర్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.