Sanjay Jaju : రేవంత్ రెడ్డి టీమ్ లో కొత్త ఐఏఎస్... ఎవరీ సంజయ్ జాజు?
జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి సీనియర్ ఐఏఎస్ లను కాదని కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజునే తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఎందుకు నియమించారు? అని చాలామంది డౌట్. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి తెచ్చుకున్న ఈ ఐఏఎస్ ట్రాక్ రికార్డు గురించి తెలుసుకుందాం.

తెలంగాణకు కొత్త బాస్
Sanjay Jaju : తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా (CS) గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజును నియమించింది. ఇప్పటివరకు సీఎస్ గా విధులు నిర్వర్తించిన రామకృష్ణారావు నుండి బాధ్యతలు స్వీకరించారు సంజయ్. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న సంజయ్ జాజుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరికోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఎవరీ సంజయ్ జాజు?
తెలంగాణ నూతన సీఎస్ సంజయ్ జాజు స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. ఆయన 26 ఫిబ్రవరి 1969 లో జన్మించారు. చిన్నతనంనుండే చదువులో చురుగ్గా ఉండేవారు... మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత టెక్నాలజీలో ఎంటెక్ (M.Tech) పట్టా పొందారు. కాస్ట్ అకౌంటింగ్లో ICWAI పూర్తి చేశారు. ఇలా ఉన్నత చదువులు ముగించుకుని సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు. ఎంతో కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన జాజు 1992 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.
సంజయ్ జాజు ఐఏఎస్ కెరీర్
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (MCH) కమిషనర్గా పనిచేశారు. 2011 నుండి 2014 వరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ కేడర్ ఐఏఎస్ గా మారారు సంజయ్. కానీ అదే సమయంలో ఆయన డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అప్పటినుండి ఇప్పటివరకు సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు.
2014 లో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన సంజయ్ జాజు 'నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్' (NHIDCL) డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత రక్షణ ఉత్పత్తి శాఖలో అడిషనల్ సెక్రటరీగా (2018-2023) సేవలందించారు. ఇటీవల కాలంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ (I&B) కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) కార్యదర్శిగా అత్యున్నత బాధ్యతలు మోశారు. ఇలా సంజయ్ జాజు తన 34 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల్లో పలు కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.
'మీ సేవ' రూపశిల్పి సంజయ్ జాజు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ కార్యదర్శిగా ఉన్న సమయంలో, ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే సులభంగా చేర్చేందుకు 'మీ సేవ' పోర్టల్ను రూపొందించి, అమలు చేయడంలో సంజయ్ జాజు అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ డిజిటల్ విప్లవం ఈ-గవర్నెన్స్ రంగంలో దేశవ్యాప్తంగా ఒక మైలురాయిగా నిలిచింది. ఇలా టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో సమర్థంగా ఉపయోగించి, అవినీతిని తగ్గించడంలోనూ, పారదర్శకతను పెంచడంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
సంజయ్ జాజుకు కీలక బాధ్యతలు...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సంజయ్ జాజు ఇక్కడ పనిచేసిందే లేదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పనితీరు అద్భుతంగా ఉండటంతో కేంద్ర సర్వీసుల్లో ఉన్నప్పటికీ ఏరికోరి సీఎస్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంల్లో పనిచేస్తున్న అనేకమంది సీనియర్ ఐఏఎస్ లను కాదు సంజయ్ కి పాలనాపరంగా కీలకమైన బాధ్యతలు అప్పగించారు.
సంజయ్ జాజుకు చీఫ్ సెక్రటరీ బాధ్యతలతో పాటు పరిశ్రమలు-వాణిజ్యం, ఐటీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా, అలాగే ప్రతిష్ఠాత్మక 'SPEED' (స్పీడ్) ఇనిషియేటివ్ పర్యవేక్షణ బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించింది.

