ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ కు మునుగోడు ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ సూపర్ విక్టరీని అందుకుంది. దాదాపు 10వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బిజెపి రెండో స్థానంలో, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన పాల్ కు 805ఓట్లు వచ్చాయి.
అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి రెండు డిజిట్ల సంఖ్యకే పరిమితమైన పాల్.. పదమూడో రౌండ్ లో అత్యధికంగా 86 ఓట్లు సాధించారు. ఇక, అత్యల్పంగా 15వ రౌండ్ (ఆఖరి రౌండ్)లో 11 ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు.
అంతా ఫ్రాడ్ అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు సీబీజై విచారణ జరిపించడంలేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తు పోలిన సింబల్స్ అభ్యర్థులకు దాదాపు 6వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్న విసయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు 482మంది ఓటు వేశారు.
ఇదిలా ఉండగా, మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టిఆర్ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇంఛార్జిగా ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూతులలో 4,009 మంది ఓటర్లు ఉండగా, 2,793 ఓట్లు పోలయ్యాయి. టిఆర్ఎస్ కు 1,610, బిజెపికి 899, కాంగ్రెస్ కు 95, బీఎస్పీకి 34, ఇతరులకు పోలయ్యాయి.
కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్ లో 47 ఓట్ల ఆధిక్యం..
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ ఎంపీటీసీ-1కు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టిఆర్ఎస్ కు 1359 కు ఓట్లు, బిజెపికి 1312 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ కు 47 ఓట్లు ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరఫున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు.
మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీష్ రావు ఇన్చార్జి వ్యవహరించారు. ఇక్కడ మూడు బూత్ లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2522 ఓట్లు పోలయ్యాయి. టిఆర్ఎస్ కు 1389, బిజెపికి 792, కాంగ్రెస్ కు 174, బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్ఎస్ కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది.
