చెత్తకుప్పల పాలైన జీహెచ్ఎంసీ మట్టి గణేషులు(వీడియో)
- జిహెచ్ఎంసి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది
- సైదాబాద్ లో మట్టి గణేష్ విగ్రహాలను చెత్తకుప్పలో పడేసిన సిబ్బంది
- విగ్రహాలతో పాటు మొక్కలను కూడా చెత్త కుప్పలోనే వేసిన జిహెచ్ఎంసి సిబ్బంది.
మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు, జిహెచ్ఎంసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోవడంలేదు. మరీ జిహెచ్ఎంసి పరిధిలో కొందరు అధికారులైతే మట్టి విగ్రహాలు పంపిణీ కోసం తెచ్చి కొద్దిసేపటి తర్వాత చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయు. ఈ సంఘటన సైదాబాద్ లో జరిగింది.
వివరాలిలా ఉన్నాయి. సైదాబాద్ చౌరస్తాలో మొక్కలు నాటి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడంతో అధికారులు భారీ సంఖ్యలో మొక్కలను, మట్టి విగ్రహాలను అక్కడకు తీసుకొచ్చారు. ఇక అక్కడ మీడియా ఉండడంతో కొద్దిసేపు మొక్కలు నాటారు. మట్టి గణపతులను జనాలకు పంపిణీ చేశారు. ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్ సహా ఉన్నతాధికారులు వెళ్లిపోయారు. తర్వాత వాటిని ఓపికగా జనాలకు పంపిణీ చేయాల్సిందిపోయి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసి అక్కడినుంచి సిబ్బంది అంతా తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోయారు. దీంతో స్థానికులు ఫైర్ అవుతున్నారు. వినాయక విగ్రహాలను తీసుకొచ్చి ఇలా చెత్త కుప్పలో పడేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినాయక విగ్రహాలతోపాటు మొక్కలను కూడా చెత్త కుప్పలోనే వేసి వెళ్లిపోయారు జిహెచ్ఎంసి సిబ్బంది. చూశారా మన ఘనమైన జిహెచ్ఎంసి పనితీరు ఎలా ఉందో?