ఆరు గ్యారంటీలు అమలయ్యేనా.. తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు ఆర్థిక కష్టాలు..
Anumula Revanth Reddy: హామీలను నెరవేర్చడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డుకాలం మొదలైనట్టుగా కనిపిస్తోంది. పౌరసరఫరాల శాఖకు రూ.52,067.03 కోట్ల అప్పులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రుణాలపై వడ్డీల కారణంగానే రూ.3,645.25 కోట్లు నష్టపోయామని మంత్రి ఉత్తమ్ పేర్కొనడం సంచలనంగా మారింది.
![Financial difficulties for Telangana Congress government cm Revanth Reddy, Will six guarantees be implemented? RMA Financial difficulties for Telangana Congress government cm Revanth Reddy, Will six guarantees be implemented? RMA](https://static-ai.asianetnews.com/images/01hhgtxg0rddjdn4ye10ew670m/thenaveena-1734604719056916710-01-jpg_363x203xt.jpg)
Telangana Congress: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇప్పుడు మిగిలిన నాలుగు హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గత కొన్ని రోజులుగా జరిగిన సమీక్షా సమావేశాలు ఆర్థిక సవాళ్ల కారణంగా ఆ నాలుగు హామీల అమలు అంత సులువు కాదని చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఖాజానా ఆర్థిక ఇబ్బందులు ఏదుర్కొవడమేనని సమాచారం. ఇతర హామీల అమలుకు విధివిధానాలను రూపొందించేందుకు సంబంధిత శాఖలతో ముఖ్యంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 100 రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పునరుద్ఘాటిస్తున్నారు. హామీల అమలుకు విధివిధానాలను రూపొందిస్తూనే ప్రతి శాఖ ఆర్థిక స్థితిగతులపై కూడా సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం అన్ని శాఖల ఆర్థిక స్థితిగతులపై ప్రజలకు వాస్తవాలు తెలిసేలా శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. విద్యుత్ రంగం, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో విద్యుత్ రంగం మొత్తం అప్పులు సుమారు రూ.81,000 కోట్లు ఉన్నాయనీ, ఈ పథకం అమలుకు ఏటా రూ.4,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు ఆయనకు వివరించినట్టు సమాచారం.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేదలకు ఆరోగ్య బీమా పథకం కింద కవరేజీని రూ.10 లక్షలకు పెంచడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి రెండు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే నెరవేర్చింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం, రూ.500కు వంటగ్యాస్ సిలిండర్లు, బీపీఎల్ కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఎకరాకు రూ.15,000 వార్షిక పెట్టుబడి సాయం తదితర హామీలు ఇంకా ఉన్నాయి. అలాగే, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు కనీస మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నిరాశ్రయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.4,000 పింఛన్, విద్యార్థులకు రూ.5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు వంటి ఆరు హామీల కింద ఇచ్చిన ఇతర ప్రధాన హామీలుగా ఉన్నాయి.
నీటి పారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ఆర్థిక పరిస్థితిని నాశనం చేసిందని మంత్రి ఆరోపించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏనాడూ కార్పొరేషన్ ను ఆర్థికంగా ఆదుకోలేదనీ, గ్యారంటీలు ఇస్తూ బయటి ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకునేలా ప్రేరేపించిందన్నారు. ఫలితంగా పౌరసరఫరాల శాఖకు రూ.52,067.03 కోట్ల అప్పులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రుణాలపై వడ్డీల కారణంగానే రూ.3,645.25 కోట్లు నష్టపోయామని చెప్పారు.
తెలంగాణలో ప్రస్తుతం 89,98,546 ఆహార భద్రత కార్డులు ఉన్నాయనీ, కొత్తగా 11.02 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పీడీఎస్ ద్వారా మొత్తం 6,47,479 మంది కార్డుదారులకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందుతున్నాయి. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం, మిగిలిన ఒక కిలో బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కిలో రూ.39.02కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న బియ్యంలో దాదాపు 90 శాతం తినదగినవి కావని వెల్లడించారు.
నాణ్యత లేని పీడీఎస్ బియ్యాన్ని డీలర్లు, ఇడ్లీ దోశ యూనిట్లు, పౌల్ట్రీ ఫారాలు తదితరాలకు కిలో రూ.5కే లబ్ధిదారులు విక్రయిస్తున్నారు. అందువల్ల పీడీఎస్ ద్వారా పేదలకు ఉచిత బియ్యం సరఫరా చేయాలనే లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతపై లోతుగా అధ్యయనం చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. పీడీఎస్ బియ్యం నాణ్యతను లబ్ధిదారులకు అందించాలని సూచించారు. పేదలకు ఇస్తున్న బియ్యం తినలేని పక్షంలో మొత్తం ప్రయోజనం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మొత్తంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంతోందిన తెలుస్తోంది. అయితే, ఇలాంటి పరిస్థితిలో మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.. !