సిరిసిల్లలో ప్రేమ పెళ్లి... నవదంపతుల పరువు హత్య...?
- వేములవాడలో దారుణం
- ప్రేమ పెళ్లి చేసుకున్నారని దంపతుల హత్య
- మేనమామే కిరాతకానికి పాల్పడ్డాడని ఆరోపణలు
- పరువు హత్యల పట్ల జనాల ఆవేదన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వేములవాడ మండలం బాలరాజుపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు హత్యకు గురయ్యారు.
నడి రోడ్డుపైనే అత్యంత దారుణంగా నరికి చంపారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారన్న కారణంగా.. అమ్మాయి బంధువులు వీరిని చంపినట్లు ఆరోపిస్తున్నారు అబ్బాయి తరపువారు.
ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
హరీశ్, రచన కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి ఇటీవల పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లిని రచన కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వివాహం తర్వాత బాలరాజుపల్లిలో ఉంటున్నారు వీరు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వీరిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు.
అమ్మాయి బంధువులే చంపారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ప్రేమికులను విగతజీవులుగా చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
అమ్మాయి మేనమామ ఈ పరువు హత్యలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.