దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య మరణించాడు. ఆ మధ్య అతను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇంటి వద్దే ఉంటున్న ఆయన సోమవారం ప్రాణాలు వదిలాడు.
నారాయణపేట: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం. హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య మరణించాడు. గతంలో ఆయన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స పొందాడు. కొద్ది రోజుల క్రితం ఆయనను కుటుంబ సభ్యులు స్వగ్రామం తీసుకుని వెళ్లారు.
నారాయణపేట జిల్లా గుడిగండ్లకు చెందిన కురమయ్య సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లోనే మరణించాడు. దిశ అత్యాచారం, హత్య కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.
Also Read: దిశ నిందితుడి భార్య, బిడ్డకి సాయం చేయండి.. ఆర్జీవీ పోస్ట్!
ఇదిలావుంటే, చెన్నకేశవులు భార్య రేణుక రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చెన్నకేశవులు మరణించేనాటికి రేణుక నిండు గర్భిణి. కురమయ్య మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశను మభ్య పెట్టి తమ వెంట తీసుకుని వెళ్లి దుండగులు ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను చంపేసి శవాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నించారు.
Also Read: ఆడపిల్లకు జన్మనిచ్చిన ‘దిశ’ నిందితుడి భార్య