కొన్నేళ్లుగా మానవాళిని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక డాక్టర్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్గా తేలినట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన్ని హోమ్ క్వారంటైన్లో ఉంచారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలోనూ కరోనా మళ్లీ కనిపిస్తోంది
ఆంధ్రప్రదేశ్లోనూ కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలోని మద్దెలపాలెం ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మహిళకు కొద్ది రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు కోవిడ్ పాజిటివ్గా తేలింది.
ఇక నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధ మహిళ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో కడప రిమ్స్ ఆస్పత్రిలో చేరింది. తీవ్రమైన జ్వర లక్షణాలు కనిపించడంతో వైద్యులు వెంటనే పరీక్షలు జరిపారు. రాత్రికి రాత్రే ఫలితాలు వచ్చి, ఆమెకు కూడా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది.
2020లో ప్రారంభమైన కోవిడ్-19 ఉధృతి ప్రజల జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో మరిచిపోలేము. రెండు వేవ్స్లో వచ్చిన కరోనా జనజీవితాన్ని అతలాకుతలం చేసింది. రెండు దఫాల లాక్డౌన్లతో దేశం మొత్తం నిలిచిపోయింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయం పెరుగుతోంది.
ప్రజలకు హెచ్చరికలు, అధికారుల అప్రమత్తత
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పాజిటివ్గా తేలిన వారిని వెంటనే క్వారంటైన్ చేస్తూ, వారి కాంటాక్ట్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న లక్షణాలు కనిపించినా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, శానిటైజేషన్ వంటివి పాటించాలని సూచిస్తున్నారు.