టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. మరోసారి సిట్ కస్టడీకి నలుగురు నిందితులు
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, ఢాక్యా నాయక్, రాజేశ్వర్లను సిట్ కస్టడీకి అనుమతించింది కోర్ట్.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజుల పాటు ప్రవీణ్, రాజశేఖర్, ఢాక్యా నాయక్, రాజేశ్వర్లను కస్టడీకి అనుమతించింది కోర్ట్. ఇదే కేసులో ప్రశాంత్ అనే వ్యక్తిని కాసేపట్లో కోర్టు ఎదుట ప్రవేశపెడతామని సిట్ అధికారులు తెలిపారు.
కాగా.. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ లీకేజీ వ్యవహారం దేశం దాటి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీమ్ (సిట్) తాజాగా ఈ విషయాన్ని గుర్తించింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి.. తన బావ ప్రశాంత్ రెడ్డికి గ్రూప్ -1 పేపర్ ను పంపించినట్టు తేల్చింది. ఆయన న్యూజిలాండ్ లో ఉండి పరీక్షకు సిద్ధం అయ్యాడు. అతడికి వాట్సాప్ ద్వారా ఈ పేపర్ ను షేర్ చేసినట్టు సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారని ‘వీ6 వెలుగు’ తన కథనంలో పేర్కొంది.
‘వీ6 వెలుగు’ కథనం మేరకు.. రాజశేఖర్ రెడ్డి తన బావ ప్రశాంత్ రెడ్డికి పేపర్ షేర్ చేయడంతో అతడికి సిట్ నోటీసులు పంపించింది. అయితే అతడు ఇప్పటికే పరీక్ష రాసి దేశం దాటి వెళ్లిపోయాడు. దీంతో మెయిల్, వాట్సప్ ద్వారా నోటీసులు పంపించారు. కానీ అతడు వాటికి ఇంత వరకు స్పందించలేదు. అయితే ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి గ్రూప్ -1 పేపర్ ను ప్రశాంత్ రెడ్డికి పంపించడంతో ఆయన న్యూజిలాండ్లోనే పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. పరీక్ష సమయానికి తెలంగాణకు వచ్చి పరీక్షకు హాజరయ్యాడు. అయితే అతడి ద్వారా మరి కొంత మందికి పేపర్ వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న దామెర రమేష్కు రాజశేఖరే పేపర్ పంపించారు. టీఎస్ పీఎస్సీ ఆరు పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారందరీనీ ఇంకో సారి సిట్ కస్టడీతోకి తీసుకోనుంది. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించనుంది.
నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, ధాక్యా నాయక్, రాజేశ్వర్ అలాగే షమీమ్, రమేశ్, సురేశ్లను తమకు ఆరు రోజుల కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇది నేడు విచారణకు రానుంది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ప్రవీణ్ వల్ల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్కు పేపర్ వెళ్లింది. ఆయనతో పాటు మాజీ టెక్నీషియన్ సురేశ్ కూడా ఈ పరీక్షకు హాజరయ్యాడు. ఇలా పరీక్షకు హాజరైన చాలా మందికి 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ విషయాలన్నీ సిట్ అధికారుల దర్యాప్తులో ప్రవీణ్, రాజశేఖర్ లే చెప్పారు. దీంతో షమీమ్, రమేశ్, సురేశ్ను సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు.