జానాని ఓడించాలని రేవంత్, కోమటిరెడ్డి కుట్రలు...: గుత్తా సుఖేందర్ సంచలనం
నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలవకుండా ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారంటూ మండలి ఛైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ: తాము జానా రెడ్డికి పెద్ద కొడుకులం, చిన్న కొడుకులం అని అని చెప్పుకునే కొందరు కాంగ్రెస్ నేతలే ఆయనను ఓడించాలని చూస్తున్నారని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలిచి ఎమ్మెల్యే అయితే తమకు పిసిసి పదవి దక్కదని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారంటూ గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన బుడ్డరఖాన్ రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.తెలంగాణ వచ్చిన సంతోషం, జరుగుతున్న అభివృద్ధి, జరగాల్సిన అభివృద్ధి పైన కాంగ్రెస్ నాయకులకు సోయి లేదు... అధికారం పోయింది, పదవులు పోయినాయి అనేదే ఎప్పుడు యావ అని మండిపడ్డారు.
ఎంపీ రేవంత్ రెడ్డి నోముల నర్సయ్య మీద కపట ప్రేమ వల్లబోస్తూ ఆయనకు అన్యాయం చేశారని, ఆయన కొడుక్కి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చారని అంటున్నాడని గుత్తా గుర్తుచేశారు. అయితే నోముల నర్సయ్యకి 2014లో పార్టీ టికెట్ ఇచ్చిందని... 2018 లో కూడా పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకొందన్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుండి నోముల ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నారని గుత్తా స్పష్టం చేశారు.
''తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది. నాగార్జున సాగర్ లోని బిసి రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని నిన్న(బుధవారం) జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషకరమైన విషయం. ఎన్నో ఏండ్లనుండి సాగర్ ప్రజల కల సాగర్ లోని క్వార్టర్స్ ని అక్కడి నివాసులకి కేటాయించాలని... నిన్నటి సభలో కేసీఆర్ క్వార్టర్స్ కేటాయింపు గురించి ప్రస్తావించడం శుభపరిణామం'' అన్నారు.
read more కాంగ్రెస్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించాం: కేసీఆర్ పై జానా ఫైర్
''నల్గొండ జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామని హామీనిచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షా పార్టీలకు కనిపించడం లేదా...?'' అని నిలదీశారు.
''జానా రెడ్డి వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదం ఉంది. ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటపటిమతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. జానా రెడ్డి తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పదవి అఫర్ ని వదులుకున్నారు అని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు... అది తప్పుడు ప్రచారం. అసలు జానా రెడ్డికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఆఫర్ రాలేదు. కనీసం టిపిసిసి అద్యక్షుడిగా కూడా ఆయనకు ఆఫర్ రాలేదు'' అని గుత్తా వెల్లడించారు.
''ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బలోపేతం చేస్తేనే నాగార్జున సాగర్ అభివృద్ధి జరుగుతుంది. అధికార పార్టీని ఆదరిస్తేనే నియోజకవర్గం ప్రగతిని సాధిస్తోందని ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని నాగార్జున సాగర్ ప్రజలు బలోపేతం చేస్తారని బలంగా నమ్ముతున్నాం'' అన్నారు.
''కావాలనే శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్న నా పేరుని కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా పేరు తీసుకొని మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.శాసన మండలి ఛైర్మన్ హోదాలో హుందాగా మండలి సమావేశాలు నడిపిస్తున్నాను.కాంగ్రెస్ నేతలు వల్ల మధ్యనే సఖ్యత లేక పదవుల కోసం కొట్లాడుకొంటున్నారు.. ఇక ప్రజలకు సేవ కార్యక్రమాలు ఎక్కడ చేస్తారు'' అని మండలి ఛైర్మన్ గుత్తా విమర్శించారు.