డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. జీవో నం. 46 రద్దు చేయాలని డిమాండ్..
తెలంగాణలోని కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. డీజపీ ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

తెలంగాణలోని కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. డీజపీ ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కానిస్టేబుల్ అభ్యర్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కానిస్టేబుల్ నోటిఫికేసన్లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 46 లో ఉన్న రేషియో వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతపద్దతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో.. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఇక, పోలీస్ రిక్రూట్మెంట్లో రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించిన జీవో 46ను రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు కోరుతున్నారు. 2016,2018లలో స్పెషల్ పోలీసు నియామకాలు రాష్ట్రస్థాయిలో చేపట్టారని.. 2022 నోటిఫికేషన్లో మాత్రం ఆ పోస్టులను జిల్లాస్థాయికి కుదించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగానే భర్తీ చేయాలన్నారు. జీవో 46 కారణంగా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోకే 53 శాతం పోస్టులు వెళ్తుండగా.. దీనివల్ల మిగిలిన జిల్లాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.