సారాంశం
ఘరానా మోసగాడు, ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ దీనిపై స్పందిస్తూ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ మండిపడ్డారు.
హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ గత కొంత కాలంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు ఆయన లేఖ రాశారు. కేటీఆర్, కవితలపై ఆ లేఖలో ఆరోపణలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆ ఆరోపణలను ఖండించారు. సదరు ఫ్రాడ్స్టర్ పై గట్టి లీగల్ యాక్షన్స్ తీసుకుంటానని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా తాను ఈడీకి స్టేట్మెంట్లు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కేటీఆర్, కవితల సన్నిహితులు తనపై ఒత్తిడి తెస్తున్నారని గవర్నర్ తమిళసైకి రాసిన లేఖలో సుకేశ్ ఆరోపించారు. ఆ ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీలో సీటు ఇస్తామని లోభపెడుతున్నట్టూ పేర్కొన్నారు. సుమారు రూ. 200 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సుకేశ్ తెలిపారు. కవితకు, తనకు జరిగిన వాట్సాప్ చాట్ రికార్డింగ్ ఉన్నదని, ఇప్పటికే ఈ ఆధారాలను 65 బీ సర్టిఫికేట్ రూపంలో ఈడీకి ఇచ్చేసినట్టు పేర్కొన్నారు. రూ. 15 కోట్లు తీసుకుని అరవింద్ కేజ్రీవాల్ తరఫునకు చెందిన వారికి అందించానని ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్టు నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించారు.
Also Read: సుకేశ్ చంద్రశేఖర్ క్రైమ్ కల్చర్.. జైలు నుంచే నేరాలు.. 81 మంది జైలు అధికారులకు లంచాలు
కాగా, ఈ అంశంపై మినిస్టర్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఓ ఫ్రాడ్స్టర్, నేరస్తుడు సుకేశ్ నాపై హాస్యాస్పదమైన ఆరోపణలు చేశారని మీడియా ద్వారా తనకు తెలిసిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. తనకు ఈ రోగ్ గురించి తెలియదని పేర్కొన్నారు. ఆ నేరస్తుడు చేసిన పచ్చి అబద్ధాలు, అర్థం పర్థం లేని వ్యాఖ్యలకు గతాను తాను కచ్చితంగా స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు.