తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాసారు. 

హైదరాబాద్ : తెలంగాణలో వెంటనే టీచర్ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాసారు. వారంరోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేసారు. లేదంటే నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడిస్తుందని సీఎం కేసీఆర్ ను కోమటిరెడ్డి హెచ్చరించారు.

గతంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వుందని... త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారని కోమటిరెడ్డి గుర్తుచేసారు. అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పి మూడేళ్లయ్యింది... ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని లేఖ ద్వారా సీఎంను కోరారు కోమటిరెడ్డి.

డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోతోందని... ఎక్కడ పరీక్ష రాయకుండానే అనర్హులుగా మిగిలిపోతామోనని లక్షలాదిమంది ఆందోళనకు గురవుతున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు లక్షలు ఖర్చుచేసి కోచింగ్ లు తీసుకుని... మరికొందరు ఏళ్లుగా ఖాళీగా వుంటూ ప్రిపేర్ అవుతున్నారని ఎంపీ తెలిపారు. ఈసారి ఎలాగయినా ఉద్యోగం సాధించాలన్న కసితో చదువుతున్న నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీదిశగా చర్యలు తీసుకోకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు

Read More 24 గంటల కరెంట్ పచ్చి అబద్ధం.. సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగిందని... ఇందులో ఏది నెరవేరిందో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కోమటిరెడ్డి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేక లక్షలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్ అందకారంగా మారిపోతోందని... వారి కుటుంబాలను కూడా బాధిస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు నెలలకోసారి టెట్, రెండేళ్లకోసారి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవారని... తెలంగాణలో ఏళ్లు గడుస్తున్నా డిఎస్సీ ఊసే లేదని అన్నారు.

స్వరాష్ట్ర సాధన కోసం అమరులు ప్రాణాలు త్యాగంచేసింది ఇందుకోసమేనా? కొన్ని దశాబ్దాలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకోసమేనా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పోరాటానికి సిద్దమయ్యిందని... అందులో భాగంగానే డిఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వారంరోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే పోరాటం ఉదృతం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.