మునుగోడులో 3.95 లక్షల మందికి లేఖలు రాయనున్న సీఎం కేసీఆర్.. ఎందుకంటే ?
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న దాదాపు 3.95 లక్షల మందికి సీఎం కేసీఆర్ లేఖలు రాయనున్నారు. ఆ నియోజకర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న సుమారు 3.95 లక్షల మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా లేఖలు రాయనున్నారు. ఈ సందర్భంగా అందులో నవంబర్ 3వ తేదీన జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.
అందులో భాగంగా ఆసరా పింఛన్లు, పంట రుణాల మాఫీ, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, దళిత బంధు, వరి సేకరణ, వడ్డీలేని రుణాల లబ్ధిదారులు, రిలీఫ్ ఫండ్, ఇతర పథకాల ద్వారా లబ్ది పొందిన వారందరికీ లేఖలు రాయాలని సీఎం నిర్ణయించుకున్నారు.
కేటీఆర్ సార్... మాకిక మీరే దిక్కు: దుబాయ్ లో చిక్కుకున్న సిరిసిల్ల యువకులు
2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 3,34,994 మంది లబ్ధిదారులు రూ.10,260 కోట్ల మేర లబ్ధిపొందారని ఆ పార్టీ గుర్తించింది. మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఎంత మేరకు లబ్ధి చేకూరిందో సీఎం కేసీఆర్ పేర్కొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ ఓట్లను అభ్యర్థించనున్నారు.
ఈ లేఖల్లో సంక్షేమ పథకం పేరు, లబ్దిదారు పేరు సీఎం కేసీఆర్ పొందుపర్చనున్నారు. ఆ పథకాలకు సంబంధించిన సమాచారంతో పాటు వివిధ పథకాల కింద ప్రతీ లబ్ధిదారుడు అందుకున్న మొత్తాలను కూడా చేర్చనున్నారు.
కాగా.. టీఆర్ఎఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దాని కోసం ప్రతీ గ్రామానికి, మండలానికి మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంచార్జ్ లుగా నియమిస్తోంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ కూడా మర్రిగూడ మండలంలోని లంకలపల్లి గ్రామ బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఆ గ్రామానికి ఆయన ఇప్పుడు ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరించనున్నారు. కాగా.. తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ టీఆర్ఎస్ నేతలను పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆదేశించారు.
పేరు మార్పుతో పెద్దగా లాభించేది ఏమీ లేదు.. బీఆర్ఎస్ పై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. త్వరలో మునుగోడు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తానని స్థానిక నాయకులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 29, 30 తేదీల్లో చండూరులో సీఎం పాల్గొనే బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.