కేసీఆర్.. జానా.. ఒక భోజన ‘పథకం’
ఈ రోజు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... జానా రెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని తన మనసులోని మాట బయటపెట్టారు.
స్వపక్షంలోనే విపక్షంగా ఉండటం చాలా అరుదైన ఘటన. ఆ రికార్డును పదే పదే సృష్టిస్తుంటారు కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి.
ఆయనేదో ఆవేశంగా మాట్లాడటం చివరికి అదే కాంగ్రెస్ కే బెడిసికొట్టడం షరా మామూలే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జానా తనదైన శైలిలో వ్యవహరించిన తీరు.. చేసిన వ్యాఖ్యలు కొంపకే ఎసరుపెట్టాయి.
జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో గాంధీ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమైన జానా ... టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 5 భోజనాన్ని పార్టీ ఆఫీసుకే పార్సిల్ తెప్పించుకున్నారు.
అక్కడే ఎంచక్కా తినేసి భోజనం బాగుందని కితాబు కూడా ఇచ్చేశారు. ఇంతకీ జానా భోజనం చేశారా.. టీఆర్ఎస్ కు భజన చేశారా అనేది ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు కాంగ్రెస్ వాళ్లకు తెలియలేదు.
ఇప్పడు మళ్లీ ఒక భోజనం కథ కాంగ్రెస్ మీదకు వచ్చేస్తుంది.
ఈ రోజు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... జానా రెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని తన మనసులోని మాట బయటపెట్టారు.
త్వరలోనే ప్రతిపక్ష నేత ఇంటికి భోజనానికి వెళ్లనున్నట్టు చెప్పారు. గతంలో సీఎంలు ప్రతిపక్షనేతల ఇంటికి వెళ్లి భోజనాలు చేసే సంప్రదాయం ఉండేదన్నారు. తాను కూడా ఇప్పుడు అదే పనిచేస్తానని తెలిపారు.
సీఎం భోజనం సరే... కానీ జానా రెడ్డి ఆ భోజన సమయాన్ని కాస్త మళ్లీ అధికారపార్టీ భజన సమయంగా మార్చేస్తారా అనేది కాంగ్రెస్ భయం.