హైదరాబాద్ అంబర్‌పేటలో అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, గోల్నాక కార్పొరేటర్‌ దుసరి లావణ్య మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది.

హైదరాబాద్ అంబర్‌పేటలో అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, గోల్నాక కార్పొరేటర్‌ దుసరి లావణ్య మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. అంబర్‌పేటలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల నిర్వహణ సందర్బంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, కార్పొరేటర్ లావణ్య అనుచరులు రోడ్డు మీదనే ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అయితే ఎమ్మెల్యే వెంకటేశ్.. తానేంటో చూపిస్తానని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

అయితే కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే వెంకటేశ్ చేయి చేసుకున్నారని ఆమె వర్గం ఆరోపిస్తుంది. పూలే విగ్రహానికి పూల మాల వేసే సమయంలో కార్పొరేటర్ లావణ్యను ఎమ్మెల్యే వెంకటేశ్ తోసుకుంటూ వెళ్లారని చెబుతున్నారు. ఇక, కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో తనను పాల్గొనీయడం లేదని కార్పొరేటర్ లావణ్య ఆరోపిస్తున్నారు. తన డివిజన్‌లో జరుగుతున్న పార్టీ ఆత్మీయ సమావేశాలకు కూడా పిలవవడం లేదని తెలిపారు.