మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు ఆదివారం నవ్య ఇంటికి రాజయ్య వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో మీడియా ఎదుటే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు ఈరోజు జానకీపురం వచ్చినట్లు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రవీణ్ మీద అభిమానంతోనే ఆయన భార్యకు టికెట్ ఇచ్చానని రాజయ్య తెలిపారు. మహిళల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. జానకీపురం వచ్చే ముందుకు అధిష్టానంతో మాట్లాడి వచ్చానని రాజయ్య తెలిపారు. గ్రామంలో సమస్యలు తన దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత సర్పంచ్‌దేనని రాజయ్య పేర్కోన్నారు. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదని.. తాను నవ్యను ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. నవ్యను చిన్నచూపు చూసే ధోరణి తనది కాదని రాజయ్య స్పష్టం చేశారు. రూ.25 లక్షల ప్రభుత్వ నిధులు ప్రకటించి వివాదానికి చెక్ పెట్టారు రాజయ్య. 

ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ.. తాను మాట్లాడిన ప్రతి మాట నిజమేనని రాజయ్య సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ఏ అన్యాయం జరిగినా ఓర్చుకోవద్దని ఆమె మహిళా లోకానికి పిలుపునిచ్చారు. మహిళలకు అన్యాయం జరుగుతోందని.. అన్యాయాలు, అరాచకాలను సహించవద్దని నవ్య పిలుపునిచ్చారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల్లో అయినా పార్టీలో అయినా మంచి , చెడు వుంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరు వేధించినా వారి భరతం పడతానని.. ఏ స్థాయిలో వున్నా మహిళలకు విలువ, గౌరవం ఇవ్వాలని నవ్య కోరారు. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే క్షమిస్తానని ఆమె స్పష్టం చేశారు. పిచ్చి వేషాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని నవ్య హెచ్చరించారు. 

Also REad: నేను మాట్లాడిన ప్రతి మాట నిజం.. రాజయ్య సమక్షంలోనే సర్పంచ్ నవ్య ఆరోపణలు

తాటికొండ రాజయ్యే నవ్యకు మద్ధతుగా నిలిచి గ్రామ సర్పంచ్‌గా చేశారని ఆమె భర్త ప్రవీణ్ తెలిపారు. ఆయన తోడ్పాటుతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ప్రవీణ్ చెప్పారు. మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చిన మాట నిజమేనని ఆయన చెప్పారు. అయితే తమ వ్యక్తిగత సమస్యల కంటే గ్రామ అభివృద్ధే ముఖ్యమని ప్రవీణ్ వెల్లడించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆత్మగౌరవ పోరాటమేనని ప్రవీణ్ వెల్లడించారు. ఆత్మగౌరవాన్ని చంపుకునేందుకు తాము సిద్ధంగా లేమని ఆయన తేల్చిచెప్పారు.