టీఎస్‌పీఎస్‌సీ  లో ప్రశ్నాపత్రాల లీకేజీ విషయమై  చైర్మెన్ రాజీనామా  చేయాలని  బీజేపీ డిమాండ్  చేసింది.  బీజేవైఎం శ్రేణులు ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు  ధర్నాకు దిగారు.  

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు మంగళవారంనాడు ఉద్రిక్తత నెలకొంది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఇవాళ ఆందోళనకు దిగారు. 

టీఎస్‌పీఎస్ సీ లో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బాధ్యులను అరెస్ట్ చేయాలని బీజేవైఎం ఆందోళనకు దిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేవైఎం ఆరోపణలు చేస్తుంది. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం బోర్డును తొలగించేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. మరో వైపు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు నిలువరించారు. బీజేవైఎం శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

యూత్ కాంగ్రెస్ ఆందోళన

టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బాధ్యులను అ రెస్ట్ చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళన దిగిన యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్ సీ కార్యాలయంలో కి వెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 

also read:టీఎస్‌పీఎస్‌సీ కేసులో విస్తుపోయే నిజాలు: ప్రవీణ్ 'నగ్న' సత్యాలపై పోలిసుల ఫోకస్

ఈ నెల 12, 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన రెండు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాలపై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలకు సంబందించిన ప్రశ్నా పత్రాల లీకేజీపై సమాచారం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షల పేపర్లు లీకయ్యాయో లేదో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.