రెండో రోజూ అదే తీరు: బండి సంజయ్ టూర్కి టీఆర్ఎస్ నిరసన సెగ, ఉద్రిక్తత
రెండో రోజూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ టూర్ లో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. ఆత్మకూర్ ఎస్ లోని ఐకేపీ కేంద్రం వద్ద రెండు పార్టీల కార్యకర్తల దాడులు చేసుకొన్నారు.
నల్గొండ: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో రెండో రోజూ కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది.మంగళవారం నాడు సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు చోటు చేసుకొన్నాయి. సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి సెంటర్లోని ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకొంది.
ఇవాళ ఉదయం సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల paddy ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు bjp చీఫ్ బండి సంజయ్ చేరుకోగానే trsశ్రేణులు బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఇదే జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ లో ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకోగానే టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు పోటా పోటీ నినాదాలు చేసుకొన్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది.
also read:ప్రారంభమైన టీఆర్ఎల్పీ భేటీ:వరిపై ఢిల్లీలో పోరుకు కేసీఆర్ ప్లాన్
రెండు పార్టీలకు చెందిన పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది. నిన్న అర్జాలబావి, శెట్టిపాలెం, చిల్లేపల్లి వద్ద కూడ ఇదే రకమైన పరిస్థితి చోటు చేసకొంది. చిల్లేపల్లి వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay కాన్వాయ్ పై రాళ్ల దాడికి దిగారు. టీఆర్ఎస్ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. వరి అంశాన్ని అస్త్రంగా చేసుకొని బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నాయి. ఇదే అంశంపై రెండు పార్టీలు తమ వాదనను సమర్ధించుకొంటున్నాయి.
వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం చేస్తున్న సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పేరుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కూడా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దసరాకు ముందు తెచ్చిన ధాన్యాన్ని కూడా కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేయలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఆందోళనను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఈ నెల 29న ధర్నా చేయాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా బండి సంజయ్ యాత్ర నిర్వహిస్తున్నందున ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు.