రాష్ట్రంలో బీజేపీ అరాచకం సృష్టిస్తోంది - శాసనమండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి
బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బండి సంజయ్ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అరాచకం సృష్టిస్తోందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా నిబంధనలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులతో ఆయనే చెలగాటం ఆడుతున్నారని అన్నారు.
సూర్యాపేట మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ కేసు.. ఆరుగురు వైద్య విద్యార్థులు సస్పెన్షన్..
బీజేపీని చూసి భారతదేశ ప్రజలంతా భయానికి గురవుతున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి, మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని విమర్శించారు. ప్రధాని మోడీ అన్ని మతాలను, కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష నాయకులపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేస్తూ ఆ నాయకులను బీజేపీ అణిచివేయాలని చూస్తోందని అన్నారు. తెలంగాణాలో కూడా ఆ పార్టీ కుయుక్తులు పన్నుతోందని తెలిపారు. ప్రజలు బీజేపీ నిరంకుశ పాలనకు చరమ గీతం పడే రోజులు దగ్గరకొచ్చాయని అన్నారు.
బండి సంజయ్ అరెస్ట్: హైద్రాబాద్లో బీజేపీ నేతల మౌన దీక్ష
రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన అధికారాలను, హక్కులను కేంద్ర ప్రభుత్వం లాగేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం ఏక ఛత్రాధిపత్యం చలాయించాలని చూస్తోందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని తెలిపారు. మోడీ పాలనలో దేశంలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బీజేపీకి అధికార యావ తప్ప మరో ఉద్దేశం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల కోసం విడుదల చేసిన 317జీవోను బీజేపీ వ్యతిరేకిస్తూ ద్వంద విధానాన్ని అవలంభిస్తోందని ఆరోపించారు.
కరీంనగర్ జైలులో బండి సంజయ్ను పరామర్శించనున్న కిషన్ రెడ్డి..
స్వరాష్ట్రంలో ఏడేళ్లుగా టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. రైతుల సంతోషాన్ని తట్టుకోలేకనే బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు. కావాలనే రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు పెట్టుబడి సాయం కింద అందజేశామని అన్నారు. రూ. 50 వేల కోట్ల పంపిణీ పూర్తయిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. ఊరురూ సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఈ రైతుబంధు పథకం గురించి తెలిసేలా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. జనవరి 10వ తేదీ నుంచి రైతు వేదికల వద్ద వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సంబరాలు జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నల్గొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్ పాల్గొన్నారు.