భద్రాచలం: ప్రభుత్వం దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం... ఆదర్శంగా నిలిచిన ఆల్ ఇండియా టాపర్
గతంలో ప్రతిష్టాత్మక సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి యువతకు ఆదర్శంగా నిలిచిన అనుదీప్ దురిశెట్టి తాజాగా కలెక్టర్ గా కూడా గొప్పపనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
భద్రాచలం: ప్రభుత్వ దవాఖానాలో సరయిన వైద్యం లభించదని నిరుపేద ప్రజలు సైతం ప్రైవేట్ హాస్పిటల్స్ బాట పడుతున్న కాలమిది. ''నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు... వద్దు వద్దు బిడ్డో సావుల దవాఖానకు'' అంటూ ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఓ సినిమా పాటే వుందంటేనే అర్థంచేసుకోవచ్చు అక్కడ వైద్యం ఎలావుంటుందో. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి మారి మంచి వైద్యం అందిస్తున్నా ప్రజల్లో మాత్రం వాటిపై నమ్మకం కలగడంలేదు.
ఈ క్రమంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందించే వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు తనవంతు ప్రయత్నం చేసారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. నిండు గర్భిణి అయిన ఆయన భార్య భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశంతో కలెక్టర్ anudeep durishetty భార్యను ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్చి అధికారులు, రాజకీయ నాయకులకే కాదు సామాన్యులకూ ఆదర్శంగా నిలిచారు.
పురిటినొప్పులతో బాధపడుతున్న భార్య మాధవిని కలెక్టర్ అనుదీప్ ఎదయినా కార్పోరేట్ హాస్పిటల్లో చేర్చవచ్చు. జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనకు ఆమాత్రం ఆర్థిక స్తోమత వుంది. కానీ ఆయన అలా చేయలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో సరయిన వైద్యం అందదని ప్రజల్లో ముద్రపడిపోయిన అనుమానాలను పటాపంచలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భార్యను భద్రాచలం ఏరియా హాస్పిటల్లో చేర్చారు.
read more కేసీఆర్ తో లంచ్ చేసిన సివిల్స్ టాపర్ అనుదీప్
అక్కడ వైద్యులు మాధవికి మెరుగైన వైద్యం అందించారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రసవం జరిగినా తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారు. జిల్లా కలెక్టర్ అయివుండి తన భార్యకు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చిన అనుదీప్ పై భద్రాద్రి జిల్లా ప్రజలతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్ పల్లికి చెందిన ఆనుదీప్ దురిశెట్టి 2017 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయనకు సొంత రాష్ట్రం తెలంగాణలోనే పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన భార్యను ప్రభుత్వం హాస్పిటల్లో ప్రసవం చేయింది అందరికీ ఆదర్శంగా నిలిచారు.
సివిల్ సర్వీసెస్ లో ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన దురిశెట్టి అనుదీప్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించడమే కాదు అతడిని కుటుంంబసమేతంగా ప్రగతిభవన్ కు ఆహ్వానించి విందు ఇచ్చారు. కేసిఆర్ తో కలిసి అనుదీప్, ఆయన కుటుంంబం భోజనం చేశారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారని చెప్పడానికి అనుదీప్ నిదర్శనమని గతంలో కేసిఆర్ అన్నారు.
read more తెలంగాణ కుర్రాడు సివిల్స్ టాపర్: "జెడి"లక్ష్మినారాయణ కొడుక్కి 196వ ర్యాంక్
ఇక గతంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆకునూరి మురళి ఇలాగే తన కూతురికి ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేయించారు. నిండు గర్భిణి అయిన తన కూతురు ప్రగతిని కలెక్టర్ గా వున్న మురళి ములుగులోని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. ఆమెకు వైద్యులు చికిత్స చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లు క్షేమంగా వున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతోందని నిరూపించేందుకే గతంలో మురళి, ఇప్పుడు అనుదీప్ తమవంతు ప్రయత్నం చేసారు.