కేసీఆర్ హైదరాబాద్ ఆపరేషన్: కాంగ్రెసుకు మరో నేత షాక్?
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబాదు ఆపరేషన్ ప్రారంభించినట్లే ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబాదు ఆపరేషన్ ప్రారంభించినట్లే ఉన్నారు. హైదరాబాదులో కాంగ్రెసును బలహీనపరిచే పథకాన్ని రచించి, అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
మాజీ మంత్రి దానం నాగేందర్ ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడగా, మరో మాజీ మంత్రి కాంగ్రెసుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాదుకు చెందిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా కాంగ్రెసుకు రాజీనామా చేస్తారని అంటున్నారు. తాను టీఆర్ఎస్ లో చేరడాన్ని నాగేందర్ ధృవీకరించారు. ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెసులో ఒక వర్గం ఆధిపత్యమే కొనసాగుతోందనే బలమైన విమర్శను సంధిస్తూ బీసీ నాయకులు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడుతున్నారు.
దానం నాగేందర్ తో పాటు ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెసుకు తీవ్రమైన నష్టమే వాటిల్లుతుంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి అవసరమైన బలం తెలంగాణలో కాంగ్రెసుకు ఉంది. ఈ స్థితిలో బీసీ నాయకులు పార్టీని వీడడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేస్తోంది.
టీఆర్ఎస్ నాయకులతో దానం నాగేందర్, ముఖేష్గౌడ్లు చాలా కాలం నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు, ఎన్నికలు సమీపసిస్తున్న వేళ కాంగ్రెసును కలవరపెట్టే వ్యూహంలో భాగంగానే వారిద్దరిని పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ నేతలు ముహూర్తాలు పెట్టినట్లు చెబుతున్నారు.