Asianet News TeluguAsianet News Telugu

సీపీఎంతో పొత్తుకు కాంగ్రెస్ చివరి యత్నం: రంగంలోకి ఖర్గే


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని  కాంగ్రెస్ భావిస్తుంది. ఒంటరిగా బరిలోకి దిగుతున్న  సీపీఎంను  ఒప్పించేందుకు  కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు ప్రారంభించింది.

AICC Chief  Mallikarjun kharge To Finalise alliance  with CPM in Telangana Assembly Elections 2023 lns
Author
First Published Nov 8, 2023, 9:48 AM IST

హైదరాబాద్: ఎఐసీసీ  చీఫ్ మల్లికార్జున్ ఖర్గే  బుధవారంనాడు హైద్రాబాద్ కు  రానున్నారు. పెండింగ్ లో  ఉన్న అభ్యర్థుల జాబితాతో  పాటు  సీపీఎంతో పొత్తు విషయమై  చర్చించనున్నారు.సీపీఎంతో పొత్తు విషయమై కాంగ్రెస్ నాయకత్వం చివరి  ప్రయత్నాలను  ప్రారంభించింది.  కాంగ్రెస్ పార్టీ  జాతీయ నాయకత్వం ఈ విషయమై సీపీఎం జాతీయ నేతలతో చర్చలను ప్రారంభించింది.  సీపీఐ తరహలోనే సీపీఎంకు కూడ  సీట్లను కేటాయించాలని భావిస్తుంది.

కొత్తగూడెం అసెంబ్లీ స్థానంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను  ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనకు సీపీఐ సానుకూలంగా  స్పందించింది.  రెండు పార్టీల మధ్య  సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే తాము కోరిన సీట్ల విషయంలో  కాంగ్రెస్ నుండి సానుకూల స్పందన లేని కారణంగా సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది.  17 అసెంబ్లీ స్థానాల్లో  సీపీఎం పోటీ చేస్తుంది.  ఇప్పటికే అభ్యర్ధులను కూడ సీపీఎం ప్రకటించింది.

 తెలంగాణ రాష్ట్రంలో  సీపీఎంతో పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.ఈ విషయమై  రాహుల్ గాంధీ సూచన మేరకు  ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీపీఎం జాతీయ నేతలతో  చర్చలు  ప్రారంభించారని సమాచారం.  మరో వైపు  సోనియాగాంధీ కూడ  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో  చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

హైద్రాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు  మల్లికార్జున ఖర్గే  ఇవాళ హైద్రాబాద్ కు రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని  మూడు అసెంబ్లీ స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.  సీపీఎంతో పొత్తు కోసమే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు.  హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత  సీపీఎంతో పొత్తు విషయమై మల్లికార్జున ఖర్గే చర్చించనున్నారు. 

also read:'ఒక్క అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు':కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

గత ఏడాది మునుగోడు అసెంబ్లీ  ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు  సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. ఈ పొత్తు తర్వాత కూడ కొనసాగిస్తామని  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. కానీ , ఈ ఏడాది ఆగస్టులో  కేసీఆర్ 115 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు.  దీంతో లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలను  కాంగ్రెస్ ప్రారంభించింది.   రెండు రోజుల క్రితం సీపీఐతో  పొత్తు  చర్చలు ఫలవంతమయ్యాయి. ఒంటరి పోరుకు దిగిన సీపీఎంతో  కాంగ్రెస్ పార్టీ చివరి ప్రయత్నాలను  ప్రారంభించింది.

Follow Us:
Download App:
  • android
  • ios