హైదరాబాద్లో బోనాల ఊరేగింపులో ఘర్షణ.. ముగ్గురికి కత్తిపోట్లు..
హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ఘనంగా జరిగింది. అయితే బోనాల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకోవడం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ఘనంగా జరిగింది. అయితే బోనాల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకోవడం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. వివరాలు.. ఆదివారం రాత్రి తార్నాకలో బోనాల పండుగ ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు.. రెండు వర్గాలుగా చిలీపోయి వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే కత్తులతో కూడా దాడులు చేసుకున్నారు.
ఈ ఘర్షణల్లో ముగ్గురికి కత్తిపోట్లతో తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.