Revanth reddy:80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా కేసీఆర్ వేసే శిక్షకు సిద్దం
తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఎదురు దాడి చేస్తున్నారు.
![TPCC Chief Revanth Reddy says if Congress not get 80 assembly seats i will be ready kcr punishment lns TPCC Chief Revanth Reddy says if Congress not get 80 assembly seats i will be ready kcr punishment lns](https://static-ai.asianetnews.com/images/01hejqe3st7v4f4dp9w6hkn127/kodangal-jpg_363x203xt.jpg)
నిజామాబాద్: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్ వేసే ఏ శిక్షకైనా తాను సిద్దమేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
బుధవారంనాడు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో తన పదవి పోతోందని కేసీఆర్ కు భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడ రావని ప్రచారం చేస్తున్నారన్నారు. డిసెంబర్ 3న ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేలుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 80 కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని రేవంత్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. 80 కంటే ఒక్క సీటు తగ్గినా కేసీఆర్ వేసే శిక్షకు తాను సిద్దమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
శ్రీరాం సాగర్, నిజాం సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను చూపి తాము ఓట్లు అడుగుతాం, కాళేశ్వరం ప్రాజెక్టును చూపి ఓట్లడిగే దమ్ముందా అని రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే బీటలు వారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అన్నారం బ్యారేజీ బీటలు వారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన నిజాం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను చూపించి తాము ఓట్లు అడుగుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఓట్లు అడగాలని ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ సవాల్ కు సిద్దమేనా అని ఆయన ప్రశ్నించారు.ఎర్రజొన్న రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయలేదన్నారు.
పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ జాడ లేకుండా పారిపోయాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.రైతుల భూములను మింగేందుకు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ వేధింపులకు గురి చేశారన్నారు.