చేయి చేయి కలుపుదాం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం : తెలంగాణ ప్రజలకు రేవంత్ సందేశం
ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చి రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
![telangana election 2023: tpcc chief revanth reddy message to telangana people ksp telangana election 2023: tpcc chief revanth reddy message to telangana people ksp](https://static-ai.asianetnews.com/images/01hff3rfr9zz4yah9a56zdy1ce/revanth---copy-jpg_363x203xt.jpg)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. దీంతో మైకులు ఎక్కడికక్కడ మూగబోయాయి. దాదాపు రెండు మూడు నెలలుగా ప్రచారంలో పాల్గొన్న నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది ప్రాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను సీఎంగా చేస్తే ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని రేవంత్ మండిపడ్డారు. ఇంతటి విధ్వంసం తర్వాత కూడా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చి రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్కు అండగా నిలవాలని ఆయన కోరారు. సోనియమ్మ ఆధ్వర్యంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మీ రేవంతన్న సందేశం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం.. ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం.. చేయి చేయి కలుపుదాం… అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం..' అని టీపీసీసీ చీఫ్ ట్వీట్ చేశారు.
అంతకుముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. దొరల తెలంగాణను, ప్రజల తెలంగాణగా మారుద్దామని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని, నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సోనియా గాంధీ సూచించారు. తెలంగాణ ప్రజల మధ్యకు రాలేకపోయానని.. కానీ ప్రజల హృదయాలకు చాలా దగ్గరయ్యానని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మార్పు కోసం ఓటేయ్యాలని.. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు గౌరవమిచ్చారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలని.. ఈ ప్రేమ , అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి వుంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు.