Asianet News TeluguAsianet News Telugu

K Chandrashekar Rao : బిఆర్ఎస్ అధినేతకు ఈసీ షాక్...ప్రగతిభవన్ కు నోటీసులు జారీ

కాంగ్రెస్ యువ నాయకుడు బల్మూరి వెంకట్ పిర్యాదు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.   

Telangana Assembly Elections 2023 ... Election Commission of India Issued notice to BRS Chief KCR AKP
Author
First Published Nov 26, 2023, 9:07 AM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రజలను, ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కేసీఆర్ కు సూచించింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో ఈసి నిబంధనలు ప్రతిఒక్కరు పాటించాల్సి వుంటుందని... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించకూడదని సూచించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ... బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ  అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఈసి  సూచించింది. ఇకపై ఇలా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణించాల్సి వుంటుందని... తగిన చర్యలు తీసుకుంటామని ఈసీఐ అడ్వైజరీ కమిటీ హెచ్చరించింది. ఈ నోటీసులను తెలంగాణ సిఈవో వికాస్ రాజ్ సీఎం కేసీఆర్ కు పంపించారు. 

అక్టోబర్ 30న బాన్సువాడ  ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ యువ నాయకుడు బల్మూరి వెంకట్ ఎన్నికల సంఘానికి లేఖ రాసాడు. దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని... ప్రచారానికి వెళ్ళిన అతడిపై కత్తితో దాడి చేసినట్లు తెలిసి ఆ సభలో కేసీఆర్ తీవ్రవ్యాఖ్యలు చేసారు.  ప్రత్యర్థి పార్టీల నాయకులకు పనికిమాలినవారు, ఈడియట్స్ అని మండిపడ్డారు. ప్రజలు నేరుగా ఎదుర్కొనే దమ్ములేకే ఇలా హింసకు దిగారని... చేతిలో కత్తి పట్టుకుని తమ నాయకులపై దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇలాంటి వారికి  తెలంగాణ సమాజమే తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. మాకు చేతులు లేవా! కత్తి పట్టలేమా! మాకు తిక్కరేగిందో దుమ్మురేగుతుంది జాగ్రత్త...ఇదే తన హెచ్చరిక అంటూ కేసీఆర్ మట్లాడారు. ఈ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి పిర్యాదు చేసాడు బల్మూరి వెంకట్. 

అసలేం జరిగింది : 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. ఇలా అక్టోబర్ 30న ఆయన ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి అతడిపై కత్తితో దాడిచేసాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది, చుట్టుపక్కల వున్న నాయకులు అప్రమత్తమై ఆ వ్యక్తిని అడ్డుకోవడం ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడి రక్తస్రావం కావడంతో ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. 

Read More  రాత్రి వేళ రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన.. నిరుద్యోగులతో చిట్ చాట్..
 
బిఆర్ఎస్ అభ్యర్థిపై హత్యాయత్నం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ప్రతిపక్షాల పనేనని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తే... తాము కాదని కాంగ్రెస్, బిజెపి అన్నాయి. ఇలా ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నంపై ఆసక్తికర రాజకీయాలు సాగాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హస్తం కూడా వుందని బిఆర్ఎస్ ఆరోపించింది. దీన్ని బిజెపి ఎమ్మెల్యే ఖండించారు. కాంగ్రెస్ నాయకులు కూడా తమకు ఈ ఘటనతో సంబంధం లేదని... అయినా బిఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బల్మూరి వెంకట్ ఏకంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపనే ఈసికి ఫిర్యాదు చేసారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios