Rythu Bandhu : ట్రైలర్ కే భయపడితే ఎలా..! ఇంకా అసలు సినిమా మిగిలేవుంది..: కవిత మాస్ వార్నింగ్ (వీడియో)
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల హడావిడిలో కూడా రైతుల కోసం ఆలోచించి రైతు బంధు అమలు చేయాలనుకుంటే... కాంగ్రెస్ మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో దాన్ని అడ్డుకుందని కేసీఆర్ కూతురు కవిత మండిపడ్డారు.
![Telangana Assembly Elections 2023 ... BRS MLC Kalvakuntla Kavitha reacts on Election Commission withdraws Rythu Bandhu disbursement AKP Telangana Assembly Elections 2023 ... BRS MLC Kalvakuntla Kavitha reacts on Election Commission withdraws Rythu Bandhu disbursement AKP](https://static-ai.asianetnews.com/images/01hbnwfrw1kp4sfr1aj166aahz/whatsapp-image-2023-10-01-at-19-14-55-3bd462c8-jpg_363x203xt.jpg)
నిజామాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది... రేపటితో ప్రచారానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పడనుంది. దీంతో జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ డిల్లీ నేతలను ప్రచారంలోకి దించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా,కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలను బిజెపి రంగంలోకి దింపితే... అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు, మల్లికార్జున్ ఖర్గే, ఇతర సీనియర్లతో కాంగ్రెస్ ప్రచారం చేయిస్తోంది. ఇలా జాతీయ నేతలంతా తెలంగాణలో వాలిపోవడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వెయ్యి బుల్డోజర్లకు కారు(బిఆర్ఎస్ గుర్తు) ఒక్కటే సమాధానమని అన్నారు. కేవలం బిఆర్ఎస్ ట్రైలర్ కే ప్రత్యర్థి పార్టీల నాయకులు భయపడిపోతున్నారు... ఇంకా అసలు సినిమా మిగిలే వుందంటూ కవిత ఎద్దేవా చేసారు.
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల హడావిడిలో కూడా రైతుల కోసం ఆలోచించి రైతు బంధు ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ నాయకులు వెంటపడిమరీ దీన్ని ఆపారన్నారు కవిత. రైతు బంధు ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమం... ఈ ఎన్నికల కోసమే తెచ్చిందేమీ కాదని అన్నారు. ముందుగానే ఈసీ వద్దంటే బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఈ పథకం గురించి వివరించి అనుమతి తెచ్చిందన్నారు. కానీ రైతుల నోటికాడి బుక్కను లాక్కున్నట్లు సరిగ్గా రైతుబంధు డబ్బులు వేసే సమయంలో మళ్లీ కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారని అన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ ఆపిన కాంగ్రెస్ ఇప్పుడు రైతుబంధు ఆపి రైతు వ్యతిరేకతను చాటుకుందని అన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటుద్వారానే జవాబు చెప్పాలని... రైతుల పక్షాన నిలిచిన బిఆర్ఎస్ కు మద్దతివ్వాలని సూచించారు. రైతులు బిఆర్ఎస్ వైపు వున్నారనే అభద్రతాభావంతో కాంగ్రెస్ ఇదంతా చేస్తోందని కవిత ఆరోపించారు.
వీడియో
తెలంగాణ ప్రజలు ఓటు వేసేముందు మంచోళ్ళు కావాలో... ముంచేవాళ్లు కావాలో ఆలోచించాలని కవిత సూచించారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కావాలో... 3 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని అన్నారు. అయినా తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కేసీఆర్ పోరాటంచేస్తున్నపుడు ఇప్పుడు ఓట్లకోసం వచ్చిన నేతలంతా ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. పంటపై మిడతల దండులా ఎన్నికలు రాగానే ఓట్లకోసం తెలంగాణపై పడ్డారు? వీరి మాటలు నమ్మి గోస పడొద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
అయితే రైతు బంధు నిధును నిలిపివేయడానికి ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఈ రైతు బంధు గురించి ఆయన ప్రస్తావించడంతో ఈసీ అనుమతిని వెనక్కి తీసుకుంది. ఈ రైతుబంధు డబ్బుల పంపిణీని బిఆర్ఎస్ తమ ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందంటూ హరీష్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఈసి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వెంటనే రైతుబంధు డబ్బుల పంపీణీ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీచేసింది.