Kodangal : రేవంత్ రెడ్డి ఇలాకాలో బిఆర్ఎస్ నేత హత్యకు కుట్రలట... ఈసీకి ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బిఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఈసికి ఫిర్యాదు చేసారు.
![Telangana Assembly Elections 2023 ... BRS Legal cell complaints to Election Commission over Kodangal Incident AKP Telangana Assembly Elections 2023 ... BRS Legal cell complaints to Election Commission over Kodangal Incident AKP](https://static-ai.asianetnews.com/images/01hcy3sy9a1ceqahm249ytpa87/telangana--jpg_363x203xt.jpg)
కొడంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో మూడురోజుల సమయమే వుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థుల ప్రచారం మరింత జోరందుకుంది. పోటాపోటీగా సాగుతున్న ప్రచారం పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలకు దారితీస్తోంది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా వుంది. ఇక్కడ గెలుపును బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ పర్యటన సందర్భంగా కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ కార్పోరేటర్ బాబా పసియుద్దిన్ కొడంగల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో బొంరాస్ పేటలో ఆయన ప్రచారం సాగుతుండగా బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రశాంతంగా తమ ప్రచారం తాము చేసుకుంటుండగా కాంగ్రెస్ నాయకులు కావాలనే గొడవకు దిగారని... దీంతో తాము కూడా ప్రతిఘటించాల్సి వచ్చిందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ ఘటనలో రెండు కార్లను ధ్వంసమయ్యాయి. తనపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడినట్లు ఫసియుద్దిన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
అయితే కొడంగల్ లో జరిగిన ఈ హింసాత్మక ఘటనపై బిఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడంగల్ లో బిఆర్ఎస్ నేత హత్యకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని భరత్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇందుకోసమే నియోజకవర్గంలో కాంగ్రెస్ భయోత్పాతం సృష్టిస్తోందని... బిఆర్ఎస్ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని... కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భరత్ పేర్కొన్నారు.
కొడంగల్ లో జరిగిన దాడికి సంబంధించి కార్పోరేటర్ ఫసియుద్దిన్ తో కలిసి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదుచేసారు భరత్. వెంటనే స్పందించి బిఆర్ఎస్ నేతపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదుపై ఈసీ స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని బిఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ భరత్ తెలిపారు.
ఇదిలావుంటే గత శనివారం కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయ్యింది. కోస్గి పట్టణంలో తమపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కోస్గి పోలీస్ స్టేషన్ లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ఐపిసి 307, 147, 148, 341, 392, 171 ఎఫ్ 504, 505, 149 తో పాటు మోటార్ యాక్ట్ 1988 కింద 192 సెక్షన్ నమోదుచేసారు. ఇలా కూర నరేష్ అనే కాంగ్రెస్ కార్యకర్తను కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది.