రేవంత్ ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ...
ప్రస్తుతం డిల్లీలో వున్న రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వీరిని ఆహ్వానించనున్నారు రేవంత్. ఇప్పటికే రేవంత్ ప్రమాణస్వీకారానికి సోనియా రావడం ఖాయమైనట్లు తెలుస్తోంది.
నేడు సోనియాగాంధీతో రేవంత్ భేటీ
రెండో రోజు కూడా డిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి ఖాయం కావడంతో కేబినెట్ కూర్పుపై అదిష్టానంతో చర్చలు జరపనున్నారు రేవంత్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నేడు రేవంత్ కలవనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రేపే ప్రమాణస్వీకారం
సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డినే సీఎంగా నియమించింది. డిసెంబర్ 7న అంటే రేపు ఆయన ప్రమాణస్వీకారం వుంటుందని కాంగ్రెస్ ప్రకటించింది.
సీఎం ఎవరు.. ఇంకా సస్పెన్సే
తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రానికి ముఖ్యమంత్రి పేరును అధిష్టానం ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ పరిస్ధితులు చూస్తుంటే మంగళవారం కూడా కష్టమే అనిపిస్తోంది.
కేసీ వేణుగోపాల్తో భట్టి భేటీ
తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంటికి డీకే శివకుమార్, మాణిక్ రావ్ థాక్రేలు వెళ్లారు.
ఎల్లా హోటల్కు కమ్యూనిస్ట్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మకాం వేసిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కు కమ్యూనిస్ట్ నేతలు వెళ్లారు. సీపీఐ నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు వెళ్లారు. సాయంత్రానికి తెలంగాణ కొత్త సీఎం ఎవరో క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు.
రేవంత్ను సీఎంని చేయాలంటూ నినాదాలు
తెలంగాణలో సీఎం ఎవరన్నది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు , రాజకీయాలకు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా కేంద్రంగా మారింది. ఇక్కడ సీఎల్పీ సమావేశం జరగ్గా, కాంగ్రెస్ నేతలంతా ఇక్కడే మకాం వేశారు. ఈ క్రమంలో మంగళవారం హోటల్ ఎల్లా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో పాటు హోటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని నిలువరించి బయటకు పంపారు పోలీసులు.
సాయంత్రం హైదరాబాద్కు డీకే శివకుమార్
తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తన నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లతో సమావేశమయ్యారు. ఈ సాయంత్రానికి కేపీసీసీ చీఫ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి హైదరాబాద్ తిరిగి రానున్నారు. రాత్రి నాటికి తెలంగాణ సీఎం ఎవరో క్లారిటీ రానుంది.
ఖర్గేతో ముగిసిన రాహుల్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్కే అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. సీఎం ఎవరన్నది సాయంత్రానికి తెలిసే అవకాశం వుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తుదిదశకు తెలంగాణ సీఎం ఎంపిక చర్చలు... ఖర్గే నివాసానికి రాహుల్, కేసి వేణుగోపాల్
దేశ రాజధాని డిల్లీలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ చేరుకున్నారు. అలాగే డికె శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్ రావ్ థాక్రే భేటీ అయ్యారు. అందరి ఏకాభిప్రాయంతో తెలంగాణ ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు.
డికె శివకుమార్ తో ఉత్తమ్ భేటీ...
దేశ రాజధాని డిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో డికె శివకుమార్ భేటీ అయ్యారు. అలాగే భట్టి విక్రమార్క కూడా జాతీయ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం ఏఐసిసి చేతికి చేరిన సమయంలో ఉత్తమ్, భట్టీ డిల్లీకి చేరడం ఉత్కంఠకు దారితీసింది.
ఇవాళ సాయంత్రంలోపు తెలంగాణ సీఎం ప్రకటన...
ఇవాళ సాయంత్రం లోపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇప్పటికే డిల్లీకి చేరుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
డిల్లీకి చేరిన కాంగ్రెస్ రాజకీయాలు...
ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలను భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కలిసే అవకాశాలున్నాయి. ఇందుకోసం వాళ్లు ఇప్పటికే దేశ రాజధాని డిల్లీకి చేరుకున్నారు.
ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా...
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో భేటీ కానున్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్..? ప్రమాణస్వీకారానికి మహూర్తం ఖరారట
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఏఐసిసి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న 10 గంటలకు రేవంత్ తో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
నేడే తెలంగాణ సీఎం ప్రకటన... డిల్లీలో వేగంగా నిర్ణయాలు
మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డికె శివకుమార్, మాణిక్ రావు థాక్రే భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఎమ్మెల్యేల ముందే వెల్లడించనున్నారు డికె. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తెలంగాణ నూతన సీఎం ఎవరన్నది తేలనుంది.
ప్రాణం వున్నంత వరకు కేసీఆర్తోనే : పాడి కౌశిక్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. తన పాత ఫోటో పెట్టి రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దన్నారు. హుజురాబాద్ను గొప్పగా అభివృద్ధి చేసుకుందామని కౌశిక్ రెడ్డి అన్నారు. తన గొంతులో ప్రాణం వున్నంత వరకు కేసీఆర్, ఆయన కుటుంబంతోనే వుంటానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ ఓటమిపై అసదుద్దీన్ స్పందన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్ఎస్ సరిదిద్దుకుంటుందని ఒవైసీ ఆకాంక్షించారు. కేటీఆర్, హరీశ్రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికిందన్నారు.
కొత్త ప్రభుత్వానికి సెక్రటేరియట్లో ఛాంబర్లు రెడీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అందుకు తగినట్లుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సచివాలయంలో సాధారణ పరిపాలనా శాఖ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. పాత బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను ఖాళీ చేస్తున్నారు. కొత్త మంత్రుల కోసం కొత్త సిబ్బందితో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు.
తెలంగాణ భవన్లో ప్రజలకు అందుబాటులో వుంటాం : కేటీఆర్
ఇకపై తెలంగాణ భవన్ నుంచి ప్రజలకు అందుబాటులో వుంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని, ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు సాధించిందని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
తెలంగాణ కొత్త సీఎం ఎవరు.. మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యలు
తెలంగాణకు కాబోయే సీఎం ఎవరన్న దానిపై కాంగ్రెస్ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఎంపీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు చేరిందన్నారు. రేపు ఏఐసీసీ పరిశీలకులతో ఖర్గే భేటీ అవుతారని, సీఎం అభ్యర్ధి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారని ఠాగూర్ చెప్పారు. కాంగ్రెస్లో ఓ విధానం వుందని.. సరైన వ్యక్తినే అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందని ఆయన తెలిపారు.
అధిష్టానం ప్రకటన తర్వాత మరోసారి గవర్నర్ వద్దకు కాంగ్రెస్ నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత ఎవరన్నది తేల్చడం కష్టంగా మారింది. దీంతో నిర్ణయాన్ని హైకమాండ్కే వదిలేశారు నేతలు. అధిష్టానం నుంచి ప్రకటన వచ్చాక కాంగ్రెస్ నేతలు మరోసారి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ను కలవనున్నారు. హైకమాండ్ నుంచి ప్రకటన తర్వాతే ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది.
సీఎం ఎవరో తేలని వైనం.. ఢిల్లీకి డీకే శివకుమార్
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది తేలడం లేదు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరగ్గా.. సీఎల్పీ నేత ఎన్నికపై క్లారిటీ లేదు. ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలను తెలుసుకున్న ఏఐసీసీ పరిశీలకులు నిర్ణయాన్ని హైకమాండ్కే అప్పగించారు. సీఎం ఎవరో తేల్చేందుకు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు.
జనగామ జెడ్పీ ఛైర్మన్ మృతిపై కేసీఆర్ సంతాపం
గుండెపోటుతో కన్నుమూసిన జనగామ జిల్లా జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉద్యమం నుంచి తన వెంట నడిచిన సంపత్ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందని కేసీఆర్ తన సంతాప సందేశంలో వెల్లడించారు.
ఫలితాలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. సోమవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.
— BRS Party (@BRSparty) December 4, 2023
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్… pic.twitter.com/ckYoTNTJBC
గజ్వేల్ ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ పత్రాన్ని స్థానిక బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆయనకు అందజేశారు. కేసీఆర్ వెంట సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వున్నారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవికి వినోద్ రాజీనామా
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయిన్పల్లి వినోద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ శాంతికుమారికి పంపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేసీఆర్ హయాంలో నియమితులైన కీలక అధికారులు కూడా ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు.
కొత్త సీఎం కాన్వాయ్ ఇదే
తెలంగాణకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి కోసం సాధారణ పరిపాలన శాఖ కొత్త కాన్వాయ్ సిద్ధం చేసింది. ఆరు తెలుపు రంగు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కొత్త కాన్వాయ్లోనే సీఎం వెళ్లేందుకు వీలుగా వాహనాలను సిద్ధం చేశారు.
మూడో శాసనసభ ఏర్పాటు , గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాసేపటి క్రితం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అందజేశారు.
కొత్త మంత్రుల కోసం సిద్ధమైన వాహనాలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కొత్త మంత్రుల కోసం ప్రోటోకాల్ ప్రకారం వాహనాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. వీటిని దిల్కుష అతిథి గృహానికి తీసుకొచ్చారు. మరికాసేపట్లో తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీ జరగ్గా.. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల మేరకు కొత్త సీఎంను ప్రకటించనున్నారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై ఐపీసీ 506, 290, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్లో సీనియర్ నేత ఈటల రాజేందర్ను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు.
కాసేపట్లో రాజ్భవన్కు వికాస్ రాజ్
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ మొదలవ్వగా.. సాయంత్రానికి సీఎం ఎవరో క్లారిటీ రానుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కాసేపట్లో రాజ్భవన్కు వెళ్లనున్నారు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల వివరాలను ఆయన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు సమర్పించనున్నారు.
ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు రాజీనామా
తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఓటమి నేపథ్యంలో ఆయన హయాంలో కీలక హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు.
కేసీఆర్తోనే నా ప్రయాణం : తెల్లం వెంకట్రావు
భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై వెంకట్రావు స్పందించారు. ఈ ప్రచారాన్ని ఖండించిన ఆయన.. తనను నమ్మి బీఫాం ఇచ్చిన కేసీఆర్కు రుణపడి వుంటానని, ఆయనతోనే తన ప్రయాణం వుంటుందని తెల్లం స్పష్టం చేశారు.
ఇవాళ రాత్రే నూతన సీఎం ప్రమాణస్వీకారం...
ఇవాళ రాత్రి 8 గంటలకు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఏఐసిసి నిర్ణయించిన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రేవంత్ కు సీఎం పదవి..: విహెచ్ మద్దతు
రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు స్వరం మారింది. గతంలో రేవంత్ కు టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వీహెచ్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం రేవంత్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు విహెచ్. కాంగ్రెస్ గెలుపుకోసం రేవంత్ ఎంతగానో కష్టపడ్డాడని... కాబట్టి ముఖ్యమంత్రిగా అతడే సరైన అభ్యర్థి అని విహెచ్ స్పష్టం చేసారు.
తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సమావేశం ప్రారంభం
తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం వుంది. అలాగే బిఆర్ఎస్ ఓటమి, ప్రతిపక్షంగా భవిష్యత్ లో ఎలా వ్యవహరించాలన్నదానిపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.
ఇవాళ సాయంత్రానికే శుభవార్త : అద్దంకి దయాకర్
ఇవాళ సాయంత్రానికే శుభవార్త వుంటుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు కాబట్టి వెంటనే ప్రభుత్వ ఏర్పాటు వుంటుందని... ఆ దిశగానే కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోందని దయాకర్ అన్నారు.
సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం ఏఐసిసి దే
సిఎల్పి తీర్మానంపై ఏఐసిసి కీలక ప్రకటన వెలవడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో రెండుమూడు గంటల్లో సీఎల్పీ నేత ఎంపిక ప్రకటన వుండనున్నట్లు తెలుస్తోంది.
ముగిసిన CLP Meetting: సీఎల్పీనేత ఎంపిక బాధ్యత మల్లికార్జున ఖర్గేకు అప్పగింత
సిఎల్పి నేత ఎంపిక బాధత్య ఆయనదే..: డికె శివకుమార్
సిఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు డికె శివకుమార్ తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలంతా ఓటర్లకు, తమ తరపున ప్రచారం చేసిన కాంగ్రెస్ అధష్టానానికి ధన్యవాదాలు తెలిపినట్లుగా డికె శివకుమార్ తెలిపారు.
ముగిసిన సిఎల్పి సమావేశం... కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే హోటల్ ఎల్లాలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసిసి పరిశీలకులు సిఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సీఎల్పీ నేతగా ఎవరన్నది నిర్ణయించే బాధ్యతను ఏఐసిసికి అప్పగించారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేటీఆర్ భేటీ...
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఆయన చర్చించనున్నారు.
ఇవాళ రాత్రే నూతన సీఎం ప్రమాణస్వీకారం...
ఇవాళ రాత్రి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం వుండే అవకాశాలు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు....
తెలంగాణ రాజ్ భవన్ లో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టెంట్లు, పర్నీచర్ చేరుకుంటోంది. పోలీసులు కూడా భరీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ సీఎల్పీ సమావేశం ప్రారంభం
తెలంగాణ సీఎల్పి సమావేశం ప్రారంభమయ్యింది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసిసి పరిశీలకులు డికె శివకుమార్ కూడా ఈ సిఎల్పీ భేటీలో పాల్గొన్నారు.
రేవంత్ దే సీఎం పదవి? ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి లతో డికె శివకుమార్ భేటీ
సీఎల్పీ భేటీకి ముందుకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పార్క్ హయత్ హోటల్లో డికె శివకుమార్ భేటీ అయ్యారు. రేవంత్ ను ముఖ్యమంత్రి చేయాలన్న నిర్ణయానికి వచ్చిన అధిష్టానం ఇందుకోసం సీనియర్లను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందని... అందులో భాగంగానే ఈ భేటీ జరుగుతున్న సమాచారం.
గవర్నర్ ను కలవనున్న తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి...
మరికొద్దిసేపట్లో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గవర్నర్ ను కలవనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల లిస్ట్ గవర్నర్ తమిళిసై కి అందజేయనున్నారు సీఈవో. ఈ లిస్ట్ అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
గంట ఆలస్యంగా సీఎల్పీ సమావేశం
తెలంగాణ సీఎల్పీ సమావేశం గంట ఆలస్యంగా ప్రారభంకానుంది. జిల్లాల నుండి వచ్చే ఎమ్మెల్యేలు కాస్త ఆలస్యంగా రావడంతో 10.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే న 65 మంది ఎమ్మెల్యేలు గచ్చిబౌలి ఎల్లా హోటల్ కు చేరుకున్నారు.
రేవంత్ రెడ్డి సీఎం కావాలి...: భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి
ప్రస్తుతం జరుగుతున్న సిఎల్పి సమావేశంలో 64 ఎమ్మెల్యేల అభిప్రాయాలను బట్టే ముఖ్యమంత్రి నిర్ణయం వుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. తాను మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుంటే బావుటుందని కోరుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇదే కోరుకుంటున్నారని మల్లు రవి తెలిపారు.
ప్రారంభమైన సిఎల్పీ సమావేశం...
తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కీలక నాయకులంతా సీఎల్పీ సమావేశం కోసం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు చేరుకున్నారు. ఏఐసిసి ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సిఎల్పీ లీడర్ ను ఈ భేటీలో ఎన్నుకోనున్నారు.
ఎల్లా హోటల్ కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...
హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ వద్ద సందడి నెలకొంది.మరికొద్దిసేపట్లో ఇదే హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ల సమావేశం జరగనుంది. ఇందుకోసం గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇప్పటికే హోటల్ కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో సిఎల్పి సమావేశం ప్రారంభంకానుంది.
ప్రగతిభవన్ ను వీడిన కేసీఆర్...
తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి ఖాయం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పదవికి రాజీనామా చేసారు. అంతేకాదు ప్రగతి భవన్, సెక్యూరిటీని వదిలి సామాన్యుడిలా ఎంపీ సంతోష్ కారులో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.
డిసెంబర్ 6నే నూతన సీఎం ప్రమాణస్వీకారం...
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం డిసెంబర్ 6న వుండే అవకాశాలున్నాయి. ఇవాళ సిఎల్పీ సమావేశంలో సీఎం ఎవరనేది నిర్ణయించనున్నారు. ఒకవేళ ఈ విషయంలో సందిగ్దత నెలకొంటే నిర్ణయాన్ని అధిష్టానమే తీసుకోనుంది. ఇందుకు సమయం పట్టే అవకాశం వుండటంతో ఇవాళ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం లేనట్లేనని సమాచారం.
కేసీఆర్ డబ్బును ప్రజలే ఓడించారు..: సీతక్క
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. మేడారం వెళుతున్న సీతక్కను మార్గమధ్యలో ఘనస్వాగతం లభించింది. వివిధ గ్రామాల ప్రజలు ఆమెపై పూలు చల్లుతూ, పూలదండలు వేస్తూ ఆప్యాయంగా సత్కరించారు. వారి ఆత్మీయతకు సంబంధించిన వీడియోను సీతక్క ఎక్స్ వేదికన పంచుకున్నారు.''200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది నేను కాదు.. మా ములుగు ప్రజలు... నా ప్రాణం వాళ్లది..'' అంటూ సీతక్క ట్వీట్ చేసారు.
200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది నేను కాదు.. మా ములుగు ప్రజలు..
— Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023
నా ప్రాణం వాళ్లది.. ములుగు నుండి మేడారం వరకు ర్యాలీగా వెళ్లి సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం జరిగింది.. మార్గమధ్యలో ప్రతీ గ్రామం వేడుకలా స్వాగతించింది.
రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు..@RahulGandhi pic.twitter.com/f1INclCOcl
బిఆర్ఎస్ ఓడినా... ఆ రికార్డ్ మాత్రం చెరగలేదు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపాలైనా అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేలంతా ఈ పార్టీకి చెందినవారే. ఈసారి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానందగౌడ్ 85వేల భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో అతడిదే టాప్ మెజారిటీ. ఇక ఆ తర్వాత సిద్దిపేట నుండి హరీష్ రావు 82 వేలు, కూకట్ పల్లి నుండి మాధవరం కృష్ణారావు 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
పవన్ పార్టీకి ఘోర పరాభవం... జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. బిజెపితో పొత్తులో భాగంగా పోటీచేసిన 8 నియోజకవర్గాల్లోనూ కనీసం గౌరవప్రదమై ఓట్లు కూడా సాధించలేకపోయింది. అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది.
Janasena Party: అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు.. తెలంగాణలో జనసేన ఫ్లాప్ షో
ఇవాళ ఉదయమే సిఎల్పీ సమావేశం... సీఎం ఎవరో తేలుస్తారా?
ఇవాళ ఉదయం 9.30 గంటలకు సిఎల్పి సమావేశం జరగనుంది. గెలిచిన కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి పరిశీలకులు డికె శివకుమార్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ కు అభినందనలు తెలిపిన బిఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి భారత రాష్ట్ర సమితి పార్టీ అభినందనలు తెలిపింది. ఇక ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్ కు అభినందనలు తెలిపారు.
గవర్నర్ను కలిసిన డీకే , రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం వుంటుందని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రమే ప్రమాణ స్వీకారోత్సవం వుంటుందని డీకే తెలిపారు.
కొత్త డీజీపీగా రవిగుప్తా
తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ను సస్పెండ్ చేయటంతో కొత్త డీజీపీని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ను సస్పెండ్ చేసింది ఈసీ. ఎన్నికల కోడ్ అమల్లో వుండగా.. సీఎం రేసులో వున్న రేవంత్ రెడ్డిని కలవడంపై కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా డీజీపీని సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
చేవెళ్లలో ఉత్కంఠకు తెర.. బీఆర్ఎస్ అభ్యర్ధిదే విజయం
చేవేళ్ల ఫలితంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి కాలే యాదయ్య విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే కేవలం 283 ఓట్ల తేడాతో యాదయ్య గెలవడంతో కాంగ్రెస్ అభ్యర్ధి భీం భరత్ రీకౌంటింగ్కు డిమాండ్ చేశారు. దీంతో ఐదు వీవీ ప్యాట్లను అధికారులు లెక్కించారు. ఇందులో బీఆర్ఎస్కు అనుకూలంగా వుండటంతో యాదయ్య గెలిచినట్లు ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఫలితం మరింత ఆలస్యం .. లీడింగ్లో బీఆర్ఎస్
హైదరాబాద్లో అత్యంత కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఫలితం మరింత ఆలస్యమవుతోంది. జూబ్లీహిల్స్లో 24వ రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్ధి 14,879 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. అయితే వీవీప్యాట్ల లెక్కింపుకు మరింత సమయం పట్టే అవకాశం వుందని , దీని తర్వాతే తుది ఫలితం ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.
తెలంగాణ అసెంబ్లీలో బంధువులు
బ్రదర్స్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వివేక్ వెంకట స్వామి, వినోద్ వెంకట స్వామి
దంపతులు : ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి
మామా అల్లుళ్లు : మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి
కేసీఆర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజాతీర్పును గౌరవిస్తూ కేసీఆర్ తన రాజీనామా లేఖను రాజ్భవన్కు దూత ద్వారా పంపారు. దీనిని పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వుండాలని చంద్రశేఖర్ రావును కోరారు.
పటాన్చెరు ఫలితాలకు బ్రేక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్కు అత్యంత చేరువలో వున్న పటాన్చెరులో ఫలితం ఉత్కంఠను కలిగిస్తోంది. 23వ రౌండ్ కౌంటింగ్ను అధికారులు నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ రీకౌంటింగ్కు పట్టుబడుతున్నారు.
దొరలపై ప్రజలదే గెలుపు : రాహుల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించినందుకు గాను ఆయన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దొరలకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రజలే గెలిచారని రాహుల్ వ్యాఖ్యానించారు.
मध्य प्रदेश, छत्तीसगढ़ और राजस्थान का जनादेश हम विनम्रतापूर्वक स्वीकार करते हैं - विचारधारा की लड़ाई जारी रहेगी।
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2023
तेलंगाना के लोगों को मेरा बहुत धन्यवाद - प्रजालु तेलंगाना बनाने का वादा हम ज़रूर पूरा करेंगे।
सभी कार्यकर्ताओं को उनकी मेहनत और समर्थन के लिए दिल से शुक्रिया।
గజ్వేల్లో కేసీఆర్ విజయం.. తగ్గిన మెజారిటీ
గజ్వేల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి, గులాబీ బాస్ కేసీఆర్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి ఈటల రాజేందర్పై విజయం సాధించారు. ఇది గజ్వేల్లో కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం . 2014, 2018లలో ఆయన వరుసగా ఇక్కడి నుంచి గెలిచారు. పై రెండు సార్లూ భారీ మెజారిటీతో గెలిచిన చంద్రశేఖర్ రావు.. ఈసారి మాత్రం ఆ స్థాయిలో ఓట్లను సంపాదించలేకపోయారు. అటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు.
ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే : కేటీఆర్
అధికారాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టమని.. వాళ్లు కూడా కుదురుకోవాలన్నారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే తెచ్చుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. స్వల్ప తేడాతో మా అభ్యర్ధులు చాలామంది ఓడిపోయారని ఆయన వెల్లడించారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. మార్పులు చేర్పులు చేసుకుని ముందుకు వెళ్తామని కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పును గౌరవించి కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ ప్రస్థానంలో ఎన్నో ఎదురుదెబ్బలు.. తట్టుకున్నాం : కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఆశించిన ఫలితం రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని, ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ఆయన తెలిపారు. ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. గతంలో బీఆర్ఎస్కు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, నిలదొక్కుకున్నామని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నిరాశపడొద్దని, రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని కేటీఆర్ సూచించారు.
గజ్వేల్ , హుజురాబాద్లలో ఈటల ఓటమి
తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. గజ్వేల్, హుజురాబాద్లలో ఆయన పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల అనంతరం ఈటల స్పందిస్తూ.. 20 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజలు వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారని పేర్కొన్నారు. వారి రుణం తీర్చుకోలేనినదని.. విజయం సాధించిన బీజేపీ అభ్యర్ధులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. అధికారం అందుకోనున్న కాంగ్రెస్కు రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఫలితాలపై మోడీ స్పందన
తెలంగాణ ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందించారు. ‘నా ప్రియమైన తెలంగాణా సోదరులారా, మీ మద్దతు బీజేపీకి ఉన్నందుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మద్దతు పెరుగుతూ వస్తోంది. రాబోయే కాలంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నాను.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
నా ప్రియమైన తెలంగాణా సోదరసోదరీమణులారా,
— Narendra Modi (@narendramodi) December 3, 2023
మీరు @BJP4India కి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, మా మద్దతు పెరుగుతూనే ఉంది, ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది.
తెలంగాణతో మా బంధం విడదీయరానిది, ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం.
ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన…
రేపే రేవంత్ పట్టాభిషేకం..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (60)ను దాటింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా సన్నహాకాలు చేస్తుంది. తొలుత డిసెంబర్ 9 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వార్తలు వచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తి మెజార్టీ రావడంతో కాంగ్రెస్ సడెన్ గా వ్యూహం మార్చింది. రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.
డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ను సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనపై ఎన్నికల కమీషన్ వేటు వేసినట్లుగా జాతీయ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఎన్నికల కోడ్ అమల్లో వుండగా.. సీఎం రేసులో వున్న రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా డీజీపీని సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
బండి సంజయ్ ఓటమి.. రీకౌంటింగ్కు డిమాండ్
కరీంనగర్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో 326 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విజయం సాధించారు. అయితే కౌంటింగ్లో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో రీకౌంటింగ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం : హరీశ్రావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని హరీశ్రావు పేర్కొన్నారు.
ఈసీకి అజారుద్దీన్ ఫిర్యాదు .. జూబ్లీహిల్స్లో నిలిచిన కౌంటింగ్
హైదరాబాద్ పరిధిలోని కీలక స్థానమైన జూబ్లీహిల్స్లో కౌంటింగ్ నిలిచిపోయింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్ధి మొహమ్మద్ అజారుద్దీన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎంఐఎం తరపున మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
రేపు గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రేపు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని నేతలు గవర్నర్కు తెలపనున్నారు. అలాగే ఎన్నికల్లో గెలిచిన స్థానాల వివరాలను కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్కు వివరించనున్నారు.
ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కే.చంద్రశేఖర్ రావు రాజీనామా చేశారు. రాజ్భవన్కు తన తరపున ప్రత్యేక దూతను పంపిన కేసీఆర్.. రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సమర్పించారు.
ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 9న కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఎల్బీ స్టేడియంలో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా డీజీపీ అంజనీ కుమార్ను కోరినట్లుగా తెలుస్తోంది. దేశం నలుమూలల నుంచి ప్రముఖులు వస్తున్నారని రేవంత్ రెడ్డి డీజీపీకి తెలిపారు. దీంతో ఎల్బీ స్టేడియంలో బందోబస్తు కోసం అధికారులను నియమించారు డీజీపీ.
కామారెడ్డిలో రేవంత్, కేసీఆర్ ఓటమి... బీజేపీ అభ్యర్ధి గెలుపు
తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు పడిన కామారెడ్డిలో అనూహ్య ఫలితం వెలువడింది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను ఓడించి బీజేపీ నేత వెంకట రమణా రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆయన దాదాపు 4,273 ఓట్ల ఆధిక్యంతె గెలవగా.. కేసీఆర్ రెండో స్థానంలో, రేవంత్ రెడ్డి మూడో స్థానంలోనూ నిలిచారు.
కాసేపట్లో కేసీఆర్ రాజీనామా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలవనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ఆయన గవర్నర్కు సమర్పించనున్నారు.
ప్రగతి భవన్ పేరు మారుస్తాం : రేవంత్
ప్రగతి భవన్ పేరు మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ అంబేద్కర్ ప్రజాభవన్గా పేరు మారుస్తామని ఆయన ప్రకటించారు. సచివాలయం గేట్లు అందరికీ తెరుచుకుంటాయని , ప్రజాభవన్లోకి సామాన్యులందరికీ ఎంట్రీ వుంటుందని రేవంత్ చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావ్ థాక్రేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీనియర్ల సహకారంతోనే ఈ విక్టరీ : రేవంత్
సీనియర్ సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. తాను , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపామని రేవంత్ వెల్లడించారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్పూర్తి నింపారని, మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందు వుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయం
ఎల్బీ నగర్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్ధులు మధుయాస్కీ గౌడ్, సామ రంగారెడ్డిపై ఆధిక్యం సాధించారు.
రసమయి బాలకిషన్పై కవ్వంపల్లి గెలుపు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై ఆయన 31,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 23 రౌండ్లు లెక్కించగా.. రసమయి బాలకిషన్ కు - 64161 ఓట్లు , కవ్వంపల్లి సత్యనారాయణ కు 95904 ఓట్లు పోలయ్యాయి.
ఆరుగురు మంత్రుల ఓటమి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఏకంగా ఆరుగురు మంత్రులను ఓడించారు. పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు ఓటమి పాలయ్యారు. వీరిలో ఎర్రబెల్లిపై పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ధి 26 ఏళ్ల యశస్వి రెడ్డి విజయం సాధించారు.
విచిత్రం : కాంగ్రెస్లో ముగ్గురు ఎంపీల గెలుపు .. బీజేపీలో ముగ్గురు ఎంపీల ఓటమి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ అందుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు విజయం సాధించారు. అటు బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్లు ఓటమి పాలయ్యారు.
వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి కారుపై దాడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ వనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్ధి, మంత్రి నిరంజన్ రెడ్డి కారుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం మీడియాతో మాట్లాడి ఇంటికి వెళ్తుండగా అగంతకులు నిరంజన్ రెడ్డి కారుపై రాళ్లతో దాడి చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పనేనంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రెండు సార్లు ఛాన్స్ ఇచ్చారు .. థ్యాంక్స్ : కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2 దఫాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్కు అభినందనలు తెలిపారు కేటీఆర్. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతామని ఆయన పేర్కొన్నారు.
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏
— KTR (@KTRBRS) December 3, 2023
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…
గోషామహల్లో మరోసారి రాజాసింగ్ ఘన విజయం
గోషామహల్ తన అడ్డా అని మరోసారి రాజాసింగ్ నిరూపించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో దిగిన ఆయన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి, బీఆర్ఎస్ అభ్యర్ధి నందకిషోర్ వ్యాస్పై రాజాసింగ్ విజయం సాధించారు. తొలి నుంచి ఆయన స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ గెలుపు దిశగా దూసుకెళ్లారు.
చేవేళ్ల ఫలితంపై ప్రతిష్టంభన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ను దాటగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్ధులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు చేవేళ్ల ఫలితంపై ప్రతిష్టంభన నెలకొంది. ఇక్కడ రీకౌంటింగ్ నిర్వహించాలంటూ కాంగ్రెస్ అభ్యర్ధి భీం భరత్ డిమాండ్ చేశారు.
సీఎం పదవిపై భట్టి విక్రమార్క కామెంట్స్
రీ విజయాన్ని సాధించిన అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 35,190 ఓట్లతో విజయం సాధించారు. తెలంగాణలో దొరల పాలన పోయిందని.. ప్రజల తెలంగాణ పాలన వచ్చిందన్నారు.
Also Read: Telangana Election Results : సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా.. భట్టి విక్రమార్క
కొల్లాపూర్ : బర్రెలక్క ఓటమి.. జూపల్లి కృష్ణారావు విజయం
నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్న బర్రెలక్క అలియాస్ శిరీష ఓటమి పాలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈమె కౌంటింగ్ ప్రారంభమైన కాసేపు లీడ్లోకి వచ్చి ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ముచ్చెమటలు పట్టించారు. అయితే చివరికి కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం
నల్గొండ జిల్లా హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్ . ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డిపై 46,748 ఓట్ల తేడాతో ఘన విజయం అందుకున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంచుకోట. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధుల లిస్టులో ఆయన కూడా వుండటంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మధిరలో మల్లు భట్టి విక్రమార్క విజయం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి లింగాల కమల్రాజ్పై దాదాపు 35,190 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన గెలిచారు. దీంతో ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధుల్లో భట్టి విక్రమార్క కూడా ఒకరు కావడంతో ఏం జరుగుతోందనని ఉత్కంఠ నెలకొంది. మండుటెండల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ ఘన విజయంలో తన వంతు పాత్ర పోషించారు.
నరసాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మా రెడ్డి ఘనవిజయం
నరసాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని భారీ లీడ్ తో ఓడించారు.
చెన్నూరులో వివేక్ వెంకట స్వామి విజయం
చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకట స్వామి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్కసుమన్పై దాదాపు 37,189 ఓట్ల ఆధిక్యంతో వివేక్ గెలిచారు. తొలుత బీజేపీలో వున్న వివేక్ వెంకట స్వామి.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో ఆయన ఇంటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం కలకలం రేపింది. అయినప్పటికీ అన్నింటిని తట్టుకుని ఆయన నిలబడ్డారు.
సత్తుపల్లిలో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా..
సత్తుపల్లిలో కాంగ్రెస్ గాలి స్పష్టంగా వీస్తోంది. అక్కడ చాలా కాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకట్రావు ను వెనుకంజలో ఉండగా.. సండ్ర పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి.. రాగమయి 10 వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతోంది. దాదాపు అక్కడ రాగమయి గెలుపు లాంచనం అయినట్టు తెలుస్తోంది.
మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి విజయం
మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. మధ్యలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ ఆమె లీడ్ కొనసాగించి , అంతిమంగా విజయాన్ని అందుకున్నారు. 2000వ సంవత్సరంలో ఉప ఎన్నిక, 2004, 2009, 2018లలో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి తాజా గెలుపుతో ఐదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీఎస్పీ నుంచి కొత్త మనోహర్ రెడ్డిలు బరిలో నిలిచారు.