Telangana Assembly Elections 2023 : పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై గందరగోళం... ఈసీ కీలక నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందకపోవడంతో ఇవాళ సాయంత్రం వరకు ఓటుహక్కను వినియోగించుకునే అవకాశం కల్పించింది ఈసి.
![Postal Ballot issue in Telangana Assembly Elections 2023 AKP Postal Ballot issue in Telangana Assembly Elections 2023 AKP](https://static-ai.asianetnews.com/images/01d9f0xxh2vfv7s9qv8bmec921/Postal-Ballot-representational-photo_363x203xt.jpg)
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై గందరగోళం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనేవారితో పాటు ప్రత్యక్షంగా పోలింగ్ లో పాల్గోనే అవకాశం లేనివారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తుంది ఈసీ. ఇలా తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేందుకు లక్షా అరవైవేల మందికి అనుమతిచ్చారు... కానీ ఇందులో సగంమంది కూడా ఓటుహక్కును వినియోగించుకోలేదు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేకపోయారని గుర్తించిన ఎన్నికల కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే గడువు నిన్నటి(సోమవారం)తో ముగిసింది. కానీ పోస్టల్ బ్యాలెట్ అందక కొందరు, ఇతర కారణాలతో మరికొందరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేకపోయారు. దీంతో గడువు పెంచాలని రాజకీయ పార్టీలు, ఉద్యోగులు కోరడంతో ఇవాళ(మంగళవారం) కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశాన్ని ఈసి కల్పించింది. ఇవాళ సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటువేసే అవకాశం ఈసి కల్పించింది.
ఎన్నికల విధులు కేటాయించిన టీచర్లు, ఇతర సిబ్బంది ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోస్టల్ బ్యాలెట్ అందనివారు ఏ నియోజకవర్గంలో అయితే ఓటుహక్కు కలిగివున్నారో ఆ రిటర్నింగ్ అధికారిని సంప్రదించాలని ఈసి సూచించారు. రిటర్నింగ్ అధికారికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ చూపించి పోస్టల్ బ్యాలెట్ తీసుకుని ఓటేయాలని ఎన్నికల సంఘం సూచించింది.
Read More telangana assembly Elections 2023: టెండర్ ఓటు అంటే ఏమిటీ?
ఇక ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ విషయమై కరీంనగర్ బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ ఈసికి లేఖరాసారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఈసీని ఆయన కోరారు. దీంతో తాజాగా పోస్టల్ బ్యాలెట్ గడువు పెంచుతూ ఎలక్షన్ కమీషన్ నిర్ణయం తీసుకుంది.
ఇదిలావుంటే పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో షాద్ నగర్ లో ప్రభుత్వ టీచర్లు ఆందోళనకు దిగారు. తమకు ఓటేసే అవకాశం లేకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని... కోర్టుకు వెళ్ళి న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్దమేనని హెచ్చరించారు. దీంతో ఎన్నికల కమీషన్ రిటర్నింగ్ అధికారుల వద్ద పోస్టల్ బ్యాలెట్ పొందాలని సూచించింది.