మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బర్రెలక్క అలియాస్ శిరీష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె తరపున మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. శిరీషను అసెంబ్లీకి పంపిస్తే ఆమె అసెంబ్లీలో ఈల వేస్తుందని ఆయన ఆకాంక్షించారు. 

బర్రెలక్క.. అలియాస్ శిరీష. ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తుతోన్న ఆమెకు రోజు రోజుకు పాపులారిటీ పెరిగిపోతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బర్రెలక్క బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెకు యువతతో పాటు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నియోజకవర్గమంతా తిరుగుతూ.. తనకు ఓటేయ్యాల్సిందిగా శిరీష కోరుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా ఆమె తరపున మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. శనివారం స్వయంగా కొల్లాపూర్ వెళ్లిన ఆయన బర్రెలక్కను కలిశారు. అనంతరం జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శిరీష లాంటి వారు అవసరమని జేడీ ప్రశంసించారు. ఆమె ఎమ్మెల్యే అయితే తొలుత సంతోషించేది తానేనని జేడీ అన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని.. శిరీష ఈ స్థాయికి రావడానికి సోషల్ మీడియానే కారణమని, దానిని మనం సమర్ధవంతంగా వినియోగించుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. 

ALso Read: సుహాస్, బర్రెలక్క, పల్లవి ప్రశాంత్, గంగవ్వ.. సంచలనంగా మారిన యూట్యూబ్ స్టార్స్ వీళ్లే..

యానాంకు చెందిన సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు ఎల్లుండి ఇక్కడకు వస్తున్నారని.. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైన అంశమని జేడీ అన్నారు. శిరీషకు ఈల గుర్తు వచ్చిందని.. దీని ద్వారా మనం అందరినీ జాగృతం చేయాలని లక్ష్మీనారాయణ చెప్పారు. శిరీషను అసెంబ్లీకి పంపిస్తే ఆమె అసెంబ్లీలో ఈల వేస్తుందని ఆయన ఆకాంక్షించారు.