Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కొత్త ఎమ్మెల్యేల్లో 80 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా ఎవరిపై ఉన్నాయంటే ?

Telangana New MLAs criminal records : నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ.. రాజకీయ పార్టీలు దానిని పట్టించుకోవం లేవు. గెలుపే ప్రామాణికంగా తీసుకుంటూ టిక్కెట్లు కేటాయిస్తున్నాయి. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 80 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన సభ్యులూ ఉన్నారు.

Criminal cases against 80 new MLAs of Telangana Who has the most cases?..ISR
Author
First Published Dec 5, 2023, 1:34 PM IST

Forum for Good Governance Report : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 119 స్థానాలకు కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అయితే ఈ కొత్త ఎమ్మెల్యేలలో 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 16 మంది పై తెలంగాణ ఉద్యమం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఎన్జీవో ఈ వివరాలు వెల్లడించింద. ఆ ఎన్జీవో ప్రకారం.. గత అసెంబ్లీలో 65 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా.. కొత్త అసెంబ్లీలో ఆ సంఖ్య 80కి పెరిగింది.

కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 50 మందిపై కేసులు ఉన్నాయి. అంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 78 శాతం మందిపై కేసులు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. అలాగే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలలో 19 మందిపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 48 శాతం మందిపై ఈ కేసులు ఉన్నాయని తెలిపింది. అయితే బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నందున.. అత్యధికంగా ఆ పార్టీకి 87 శాతం మంది అయ్యారని ఎన్జీవో వెల్లడించింది.అలాగే ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో నలుగురిపై (57 శాతం) కేసులు ఉన్నాయి. 

కాగా.. ఎన్నికల అనంతరం క్రిమినల్ కేసులతో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోందని ఎన్జీవో పేర్కొంది. అయితే నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని  ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభ రెడ్డి తెలిపారు. పార్టీలన్నీ గెలుపే ప్రమాణంగా తీసుకుంటున్నాయని చెప్పారు. 

ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల అభ్యర్థుల నేర చరిత్రను ఆ ఎన్జీవో గత నెలలో విశ్లేషించింది. ఇందులో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన 226 మంది నామినీలపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఒక కమిటీ విశ్లేషించి నివేదికను సిద్ధం చేసింది. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు ఇచ్చిన 118 మంది అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తించింది. 

కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే ఖానాపూర్ (ఎస్టీ) నియోజకవర్గానికి చెందిన వెడ్మ బొజ్జుపై 52 కేసులు, మంచిర్యాలకు చెందిన కొక్కిరాల ప్రేంసాగర్ రావుపై 32 కేసులు ఉన్నాయి. వీరంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాగే బీజేపీ టిక్కెట్ పై గోషామహల్ నుంచి ఎన్నికైన టి.రాజా సింగ్‌పై 89 కేసులున్నాయి. ఆయన ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంతో పాటు ఇతర వర్గాల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు చాలాసార్లు బుక్ అయ్యారు.

అలాగే కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికైన బీఆర్‌ఎస్ నేత గంగుల కమలాకర్‌పై 10 కేసులు ఉన్నాయి. గజ్వేల్ నుంచి మళ్లీ ఎన్నికైన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై తొమ్మిది కేసులున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై కూడా ఎనిమిది కేసులు ఉన్నాయి. అలాగే పాత బస్తీలో గత తన స్థానాలను సుస్థిరం చేసుకున్న ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేలపై కూడా కేసులు ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఆరు కేసులు ఉన్నాయి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై ఒక్కో కేసు ఉందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios