తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  రాహుల్ గాంధీ,  ప్రియాంకగాంధీ, ఆశోక్ గెహ్లాట్ లు మల్కాజిగిరిలో  రోడ్ షోలో పాల్గొన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుఫాన్ రాబోతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమాను వ్యక్తం చేశారు.

మంగళవారంనాడు  మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ రోడ్ షో నిర్వహించారు.  ఈ సందర్భంగా మల్కాజిగిరిలో ఆయన  ప్రసంగించారు. 

మీతో తమది రక్త సంబంధమన్నారు. తాము తెలంగాణ ప్రజలతో రాజకీయ బంధం కోరుకోవడం లేదన్నారు.  ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, తాను, తన సోదరి ప్రియాంక గాంధీలు  తెలంగాణ ప్రజలతో ఆత్మీయ బంధాన్ని కోరుకుంటున్నట్టుగా ఆయన  చెప్పారు. 

భారత్ జోడోయాత్రలో  తాను ఒక్కటే చెప్పానన్నారు. విద్వేష దేశం మనకు అవసరం లేదని చెప్పానన్నారు. ప్రేమతో  ఏదైనా సాధించవచ్చని ఆయన గుర్తు చేశారు. తనపై  మోడీ సర్కార్  24 కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. తన ఎంపీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. అంతేకాదు తన ఇల్లును కూడ లాక్కొన్నారని ఆయన ఆరోపించారు.  కోట్లాది మంది హృదయాల్లో నా ఇల్లు ఉందని చెప్పారు.  కేసీఆర్ కు అవసరమైనప్పుడు కేంద్రం సహకరిస్తుందని ఆయన విమర్శించారు.   మోడీ సర్కార్ కు  బీఆర్ఎస్ సహకరిస్తుందని  రాహుల్ గాంధీ ఆరోపించారు.


బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఆయన చెప్పారు. ప్రియాంక గాంధీ, నేను ఢిల్లీలో మీ కోసం సైనికులుగా పనిచేస్తామని  రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణ ప్రజలకు  కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  తెలంగాణలో అధికారంలోకి రాగానే  తొలి కేబినెట్ సమావేశంలోనే  ఈ ఆరు గ్యారంటీల అమలుకు  తీర్మానం చేయనున్నట్టుగా రాహుల్ గాంధీ వివరించారు.

Scroll to load tweet…

అంతకు ముందు  ప్రియాంక గాంధీ మాట్లాడారు. దొరల తెలంగాణ కావాలా... ప్రజల తెలంగాణ కావాలా అని  కాంగ్రెస్ నేత  ప్రియాంక గాంధీ  ప్రజలను ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వం మీకు ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిందా అని ఆమె ప్రశ్నించారు.   కేసీఆర్ కుటుంబంలో  అందరికీ  ఉద్యోగాలు వచ్చాయని ఆమె చెప్పారు.మీ ఓటుతోనే మీ భవిష్యత్తు ఉంటుందని ఆమె చెప్పారు.  కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. కానీ  తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలోని ఆకాంక్షలు నెరవేరినట్టుగా  ఆమె ఆరోపించారు.