CM KCR: రేపు చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం కేసీఆర్..
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో వినియోగించుకోనున్నారు.
![CM KCR Cast Her Vote In Native Village Chintamadaka Siddipet KRJ CM KCR Cast Her Vote In Native Village Chintamadaka Siddipet KRJ](https://static-ai.asianetnews.com/images/01heyg56qzykfv7cfzyyer4egs/cm-kcr--3--jpg_363x203xt.jpg)
Telangana Elections 2023: మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక స్వగ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సతీమణి శోభతో కలిసి కేసీఆర్ చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.
ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా.. సీఎం కేసీఆర్ (CM KCR) రాక సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చింతమడక వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అదే విధంగా మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నంది నగర్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలో.. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో గల బీఎస్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఈసీ ఏర్పాట్లు చేసింది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అధికారులకు అందజేసింది. ఈవీఎంలకు సంబంధించిన వివరాలను, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్నికల సిబ్బందికి వివరించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు స్థానిక సాయుధ బలగాలు, హోంగార్డులు, ఏపీ పోలీసులు, రైల్వే పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సీఆర్పీఎఫ్, ఝార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల ఆర్మ్డ్ ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే.. పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. పలుచోట్ల డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.